సైకిల్ యాత్ర… అంతకుముందే ఈ పనిచేస్తేనే లాభం!

నారా లోకేష్….టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆస్తిపాస్తులతో పాటు అతని రాజకీయానికి కూడా వారసుడు. విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో చదివిన లోకేష్…కొద్ది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన లోకేష్….గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఈ నేపథ్యంలో, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎపుడు ప్రారంభిస్తారు.. ఎక్కడ నుంచి ప్రారంభిస్తారు.. వంటి విషయాలు చర్చకు వస్తున్నాయి.

అయితే, యాత్ర కంటే ముందు టీడీపీ అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ పై ప్రతిపక్ష వైసీపీ నిరంతరాయంగా పలు విమర్శలు గుప్పించింది. చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ సమర్థుడు కాదని, లోకేష్ కు కులముద్ర వేసి, లోకేష్ పై వ్యక్తిగత విమర్శలకు దిగింది.

వ్యక్తిత్వ హననం కొన్ని సార్లు జరిగింది. ఏదైనా పదేపదే ప్రచారమైతే దానికి కొంత మద్దతు లభిస్తుందన్నట్లే లోకేష్ పై వైసీపీ నిరంతరం చేసిన ప్రచారం విషయంలో అదే జరిగింది. పైగా ఆ ప్రచారాన్ని టీడీపీ లైట్ తీసుకుంది. ఎపుడూ బలంగా తిప్పికొట్టింది లేదు. దీంతో లోకేష్ పై వైసీపీ విమర్శలను కొందరు టీడీపీ నేతలు కూడ నమ్మారు. దీంతో, లోకేష్ పై ఇటు కేడర్ లో అటు ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా ప్రచారం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది.

దానికి తోడు గత ఎన్నికల్లో ఓటమితో లోకేష్ పొలిటికల్ కెరీర్ పై టీడీపీ నేతలు…ముఖ్యంగా యువనేతల్లో కూడా ప్రశ్నలు లేవనెత్తేలా వైసీపీ దుష్ప్రచారం చేసింది. దీంతో, లోకేష్ చేపట్టబోతోన్న సైకిల్ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ తన సైకిల్ యాత్ర చేపట్టడానికి ముందే టీడీపీ యంగ్ లీడర్ షిప్ కి దగ్గర చేసుకునే ఆత్మీయ యాత్ర చేయాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీలోని యువనేతలతో లోకేష్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ భేటీలు ఏర్పాటు చేసే వారికి దగ్గరవడం అవసరం అంటున్నారు. వీలైతే.. ఆయా జిల్లాల్లో యువ నేతలతో జిల్లాకో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తే మంచిందటున్నారు.

ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి దాదాపు ఏడాదిన్నర అయింది. ఈ సంవత్సరన్నర కాలంలో టీడీపీ నుంచి సీనియర్ నేతలే మీడియా ముందు యాక్టివ్ గా కనిపిస్తున్నారు. టీడీపీలోని యువనేతలు పెద్దగా మీడియా ముందుకు రావడం కానీ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కానీ జరగడం లేదు.

దీనికి తోడు, నారా లోకేష్ తాము ఫోన్ చేసినా వెంటనే స్పందించరని, తమకు పెద్దగా అందుబాటులోకి రారని కొందరు యువనేతల్లో అసంతృప్తి ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలో వారితో లోకేష్ ఎంత ఎక్కువగా ర్యాపో మెయింటెన్ చేస్తే అంత మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అన్ని వర్గాల యువనేతలను కలుపుకుపోవడం వల్ల ఆయా ప్రాంతాల సమస్యలు, పరిస్థితులపై లోకేష్ కు మరింత అవగాహన పెరుగుతుంది. అదే సమయంలో లోకేష్ అవగాహన, సమర్థతపై యువనేతలకు మరింత నమ్మకం కలుగుతుంది. అదే సమయంలో పార్టీలోని సీనియర్లతో కూడా లోకేష్ టచ్ లోకి రావడం వల్ల వారి అనుభవం ఉపయోగపడుతుంది.

ఇలా అందరికీ అందుబాటులోకి రావడం వల్ల లోకేష్ పై యంగ్ లీడర్ షిప్ కి ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. ఇలా అందరినీ లోకేష్ కలుపుకుపోయిన తర్వాత సైకిల్ యాత్ర చేస్తే…హ్యూజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. దీనివల్ల ఇటు టీడీపీకి, అటు లోకేష్ కెరీర్ కు మంచి మైలేజ్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.