17 సీట్లపైనే కేసీఆర్ ప్రత్యేక దృష్టి ?

ప్రత్యేక తెలంగాణా ఏర్పడినప్పటి నుండి గడచిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవని సీట్లు 17 ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వీటన్నింటిని లేకపోతే కనీసం మెజారిటీ స్ధానాల్లో అయినా గెలవాలని కేసీఆర్ మహా పట్టుదలగా ఉన్నారు. ఇందుకనే వీటిపై ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మొదటి నుండి తెలంగాణా ఉద్యమంతో ఖమ్మం జిల్లాకు సంబంధం లేకుండానే రాజకీయాలు నడిచిపోతున్నాయి.

రాష్ట్రమంతా తెలంగాణా ఉద్యమం నడిచిన రోజుల్లో కూడా ఖమ్మంలో ఉద్యమం ఛాయలు కనబడలేదు. అలాగే తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను జనాలు ఆదరించలేదు. ఈ విషయమే కేసీయార్ ను బాగా కలిచేస్తోంది. 2014 ఎన్నికల్లో మొత్తం పదిసీట్లలోను పోటీచేస్తే కొత్తగూడెంలో జలగం వెంకట్రావు మాత్రమే గెలిచారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లోను కొన్నింటిలో రెండో స్ధానం మరికొన్నింటిలో మూడో స్ధానంలో ఉండిపోయింది. అందుకనే కాంగ్రెస్ తరపున గెలిచిన కొందరు ఎంఎల్ఏలను పార్టీలో కలుపుకున్నారు.

తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పది నియోజకవర్గాల్లో పోటీచేసినా గెలిచింది మళ్ళీ ఒక్కళ్ళు మాత్రమే. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కళ్ళే గెలిచారు. దాంతో పాత పద్దతినే అనుసరించిన కేసీయార్ కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచిన కొందరు ఎంఎల్ఏలను లాగేసుకున్నారు. ఏదో పద్దతిలో జిల్లాలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలున్నారని అనిపించుకున్నారు. జిల్లాలోని మధిర, వైరా, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, పాలేరు, భద్రాచలంలో గెలుపుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఒకటికి రెండుసార్లు బహిరంగసభలు నిర్వహించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషామహల్, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, కార్వాన్, ఛార్మినార్, యాకత్ పూర, బహద్దూర్ పుర, నాంపల్లి, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదు. అందుకనే ఇక్కడ కూడా పదేపదే ప్రచారం చేస్తున్నారు. కేసీయార్ బహిరంగసభల్లో పాల్గొనటమే కాకుండా మంత్రి కేటీయార్ రోడ్డుషోలు, ర్యాలీలు కూడా చేస్తున్నారు. మరి మూడో ఎన్నికల్లో అయినా కేసీయార్ ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.