కేసీయార్ పై కాంగ్రెస్ ఆరోపణలు కరెక్టేనా ? సేమ్ సైడ్ గోల్

ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి తానేం మాట్లాడుతున్నారో కూడా కేసీయార్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎన్డీయేలో చేరాలని అనుకున్నమాట నిజమే అని అంగీకరించారు. అలాగే కేటీయార్ ముఖ్యమంత్రిని చేయాలని అనుకుని నరేంద్రమోడీ ఆశీర్వాదం అడిగిన మాట కూడా నిజమే అని అంగీకరించారు. కేసీయార్ ఇంటర్వ్యూ ఇపుడు ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది.

కేసీయార్ ఇంటర్వ్యూ 27వ తేదీ మ్యాగజైన్లో ఉంది. ఆమధ్య నరేంద్రమోడీ తెలంగాణా పర్యటనలో మాట్లాడుతు కేసీయార్ ఎన్డీయేలో చేరుతానంటే తాను కుదరదని తేల్చి చెప్పినట్లు చెప్పారు. అలాగే కేటీయార్ ను సీఎం చేయాలని అనుకుంటున్నానని తన బ్లెస్సింగ్స్ అడిగితే కుదరదని చెప్పినట్లు మోడీ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. దాంతో కాంగ్రెస్ నేతలు మోడీ, కేసీయార్ ఒకటే అని పెద్దఎత్తున గోల మొదలుపెట్టారు. ఇద్దరు ఒకటి కాకపోతే కేసీయార్ ఎన్డీయేలో చేరుతానని అడగటం, కేటీయార్ కు మోడీ ఆశీస్సులు దేనికని నిలదీశారు.

దాంతో కాంగ్రెస్ ఆరోపణలతో పాటు మోడీ వ్యాఖ్యలపై కేసీయార్ మాట్లాడలేదు కానీ కేటీయార్ విరుచుకుపడ్డారు. ఎన్డీయేలో చేరుతానని కేసీయార్ ఎన్నడూ అడగలేదని, తనను సీఎం చేయాలని కేసీయార్ అనుకుంటే మోడీ ఆశీస్సులు దేనికని ఎద్దేవా చేశారు. ఎంఎల్ఏల బలముంటే సరిపోతుంది కదాని లాజిక్ కూడా మాట్లాడారు. మోడీ వ్యాఖ్యల్లో, కేటీయార్ ఎదురుదాడిలో ఏది కరెక్టో జనాలకు తెలీదు. అయితే పోలింగ్ మరో పదిరోజులుండగా కేసీయార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ చెప్పిందే నిజమని, కేటీయార్ అబద్ధం చెప్పారని అర్ధమైపోతోంది.

ఇంటర్వ్యూలో కేసీయార్ అంగీకరించిన విషయాలన్నీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలమిచ్చేట్లుగానే ఉన్నాయి. ఇది ఒకరకంగా సేమ్ సైడ్ గోల్ వేసుకున్నట్లుగానే ఉంది. మ్యాగజైన్లోని వివరాలను కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుని కేసీయార్+మోడీ ఒకటే అన్న ఆరోపణల మోతాదును పెంచితే బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరీ ఇంటర్వ్యూను కాంగ్రెస్ నేతలు ఏ మేరకు అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడాలి.