విపక్ష నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్

ప్రతిపక్ష నేతలపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. జనగామ వచ్చి కుక్కలు మొరిగిపోయాయని బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధపడుతున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, విపక్ష నేతలనుద్దేశించి కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు పిండం పెడతానంటున్నారని, కానీ ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉద్యమం సమయంలో బచ్చన్నపేటలో నీటి ఎద్దడి చూసి ఏడ్చానని, ఈరోజు బచ్చన్నపేటలో చెరువులో నీళ్లు ఉంటున్నాయని, ప్రతి ఇంటికి నీరు అందించామని చెప్పుకొచ్చారు.

రైతుబంధు వృథా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ గెలిస్తే రైతులకు 3 గంటల విద్యుత్ ఇస్తారని కేసీఆర్ అన్నారు. 5 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్నో సినిమాలు చూయించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే హామీలను నమ్ముతామా అని ప్రజలను ప్రశ్నించారు. అభ్యర్థుల గుణగణాలు, పార్టీ చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించింది కాంగ్రెస్ అని, ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. మళ్లీ దళారుల రాజ్యం తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే క్రమంగా రైతుబంధును 16 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బిఆర్ఎస్ అని చెప్పారు. 2004లో తమ పార్టీతో పొత్తు వల్లే కాంగ్రెస్, ఢిల్లీ, తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయినా, 2004లో ప్రత్యేక తెలంగాణ ఇవ్వలేదని అందుకే మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించానని చెప్పుకొచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనను, ఈ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చి చూసుకోవాలని కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గం చేర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.