చంద్రబాబుకు ఆ క్రెడిట్ ఇవ్వొద్దు.. 2018 గెలుపు మాదే

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ భారీగా సీట్లు సాధించి.. రెండోసారి అధికారంలోకి రావటానికి చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకోవటం కనిపిస్తుంది.

ఈ సందర్భంగా చాలామంది నోటి నుంచి వచ్చే రెగ్యులర్ కామెంట్.. చంద్రబాబు పుణ్యమా అని తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ ఎదుట ప్రస్తావించినప్పుడు.. అందుకు ఆయన ఒప్పుకోలేదు సరికదా.. ‘ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇవ్వొద్దు’ అని వ్యాఖ్యానించారు.

రూరల్ ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం మీకు లాభించిందన్న వాదనకు మంత్రి కేటీఆర్ ఏకీభవించలేదు. కాకుంటే.. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో చంద్రబాబు తెలంగాణలో చేసిన ప్రచారం తమకు కాస్త సానుకూలంగా మారిందని.. అదే మొత్తం కాదని ఒప్పుకోవటం గమనార్హం. చంద్రబాబు రాకతో సెంటిమెంట్ ను రగల్చటానికి అవకాశం చిక్కిందన్న మాటను ఒప్పుకోని మంత్రి కేటీఆర్.. చంద్రబాబు రాక ముందే టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని.. కాకుంటే చంద్రబాబు రాకతో అది కొంచం పెరిగి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేయటం గమనార్హం.

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్న భావన ప్రచారంలోకి వచ్చిందన్న వ్యాఖ్యకు స్పందించిన కేటీఆర్.. ‘దానికి ప్రాతిపదిక ఏమిటి? అదంతా సోషల్ మీడియాలో ప్రచారం తప్పించి మరేమీ లేదు’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. కాంగ్రెస్ గెలుపుకు ఒక ప్రాతిపదిక చెప్పాలని మంత్రి కేటీఆర్ కోరుతూ.. ‘సీ ఓటర్ 2018లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. కానీ మేం గెలిచాం. ఇప్పుడు వారు అదే చెబుతున్నారు. కానీ.. మిగిలిన సర్వేలే తీసుకుంటే.. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్ని కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పాయి. సర్వేలను ప్రాతిపదికగా తీసుకున్నా మా గెలుపు ఖాయం’ అన్న విషయాన్ని ప్రస్తావించటం కనిపిస్తుంది. సునీల్ కనుగోలు లాంటి వాళ్లు ఒక వాతావరణాన్ని కల్పించి.. గెలుస్తుందని చెప్పటమే తప్పించి.. కాంగ్రెస్ గెలుపుకు ఎలాంటి ప్రాతిపదిక లేదని తేల్చేశారు మంత్రి కేటీఆర్.