వ‌స్తాన‌న్నా.. వ‌ద్దన్నారా? ష‌ర్మిల ఊసేది బ్రో!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొన్నాన‌మ‌ని, కాంగ్రెస్ గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని, ప్ర‌చారం చేస్తామ‌ని చెప్పిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేత‌ల నుంచి ఎక్క‌డా గ్రీన్ సిగ్న‌ల్ క‌నిపించ‌లేదు. ఆమె ఊసు, ధ్యాస కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. “కేసీఆర్ ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యం. అందుకే త్యాగాలు చేస్తున్నాం. పోటీకి దూరంగా ఉంటున్నాం. మేం పోటీ చేస్తే.. ఓట్లు చీలిపోయి.. మ‌రోసారి కేసీఆర్ విజ‌యం ద‌క్కించుకుంటారు. అందుకే దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించాం” అని షర్మిల ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

ముఖ్యంగా పాలేరు నుంచి ఆమె పోటీ చేయాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. అక్క‌డ కూడా పోటీ చేయ‌డం లేద‌ని.. ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి పొంగులేటిని ఓడించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత‌గా కాంగ్రెస్ కోసం ఆమె త్యాగాలు చేసినా.. ఆ పార్టీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల‌ను ప‌ట్టించుకోలేదు. క‌నీసం ప్ర‌చారానికి ర‌మ్మ‌ని కానీ.. పార్టీ త‌ర‌ఫున దంచి కొట్ట‌మ‌ని కానీ.. పిలుపు అంద‌లేదు.

మ‌రి కాంగ్రెస్‌వ్యూహం ఏంటి? ష‌ర్మిల త్యాగాలు వృథా కావాల్సిందేనా? అనే చ‌ర్చ వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పోటీ నుంచి పార్టీ విర‌మించుకోవ‌డంతో ఆ పార్టీ నేత‌లు.. దూర‌మ‌య్యారు. లోపాయి కారీగా ఈ పార్టీ నాయ‌కులు బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఇలా పార్టీలైన్‌ను దాట‌డంపైనా ష‌ర్మిల కార్యాల‌యం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. దీంతో ష‌ర్మిల త్యాగాలు.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది.

అయితే.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న‌చ‌ర్చ మ‌రోవిధంగా ఉంది. ష‌ర్మిల మ‌ద్ద‌తు కోరితే.. బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని.. ష‌ర్మిల‌ను ఇప్ప‌టికీ ఏపీకి చెందిన కుటుంబంగానే తెలంగాణ స‌మాజం భావిస్తోంద‌ని.. పైగా ఆమెకు ఓటు బ్యాంకు ఎక్క‌డా లేద‌ని.. ఇప్పుడు ఆమె ఆహ్వానించి… ప్ర‌చారానికి అవ‌కాశం ఇస్తే.. చేజేతులా న‌ష్ట‌పోతామ‌ని కూడా.. నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల‌ను ఎవ‌రూ పట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.