ఏపీ వ‌ద్దంది.. మేం తీసుకుంటున్నాం.. త‌ప్పేంటి: కేటీఆర్

“ఏపీ వ‌ద్దంది. మేం తీసుకుంటున్నాం. త‌ప్పేంటి?” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ నుంచి అమ‌రరాజా బ్యాట‌రీ కంపెనీ తెలంగాణ‌కు త‌ర‌లిపోయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. “ఏపీ వద్దంది. మేం కూడా వ‌దిలేస్తే.. ఆయ‌న‌(గ‌ల్లా జ‌య‌దేవ్‌) బెంగ‌ళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం. ఇందులో త‌ప్పేంటి? మేం బ‌ల‌వంతంగా లాక్కుంటే త‌ప్పు” అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ కూడా అభివృద్ధి చెందాల‌నే తాము కోరుకుంటున్నామ‌న్నారు. అయితే.. పెట్టుబ‌డి దారుల‌కు అక్కడ స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయ‌ని.. అక్క‌డ ఉండ‌లేని ప‌రిస్థితి త‌లెత్తితే.. తొలి గ‌మ్య‌స్థానం తెలంగాణేన‌ని చెప్పారు. అమ‌ర‌రాజా కంపెనీ అధినేత జ‌య‌దేవ్ కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉంటోంద‌న్నారు. అందుకే వారు తెలంగాణ‌కు వ‌చ్చార‌ని తెలిపారు.

“ఏపీలోనూ పెట్టుబ‌డులు పెట్టాల‌నే మేం కోరుకుంటున్నాం. ఏపీపై మాకు ద్వేషం లేదు. టీడీపీపై అంత‌క‌న్నా లేదు. కానీ, చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో నిర‌స‌న‌లను అడ్డుకున్నాం. ఎందుకంటే.. వైసీపీ-టీడీపీల‌కు హైద‌రాబాద్ యుద్ధ‌రంగం కాకూడ‌ద‌నే. ఏపీలో ఉండ‌లేమ‌ని భావిస్తున్న‌వారికి తెలంగాణ ఫ‌స్ట్ ఎట్రాక్ష‌న్ గా మారింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా అంతే” అని కేటీఆర్ అన్నారు. కాగా, గ‌త ఏడాది అమ‌ర‌రాజా కంపెనీ త‌న రెండో విభాగాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

9500 కోట్ల రూపాయ‌ల ద‌శ‌ల‌వారీ పెట్టుబ‌డితో గిగా బ్యాట‌రీ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ విష‌యం అప్ప‌ట్లోనే సంచ‌ల‌నంగా మారి.. రాజ‌కీయ దుమారానికి కూడా దారి తీసింది. అమ‌ర‌రాజా అధినేత గ‌ల్లా జ‌య‌దేవ్‌.. టీడీపీ త‌ర‌ఫున గుంటూరు ఎంపీగా 2019లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. రాజ‌కీయ కార‌ణాల‌తోనే అమ‌ర‌రాజా హైద‌రాబాద్‌కు త‌ర‌లిపోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.