‘నేను చేసిన 45 కంప్లైంట్లకు చర్యలేంటి?’

సంచలన ప్రకటనతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా.. ముఖ్యమంత్రి జగన్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత.. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలతో పాటు.. వారి ఆస్తుల్ని జఫ్తు చేస్తామన్న ఆయన వ్యాఖ్యలపై విపక్ష నేతలు స్పందిస్తున్నారు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్నలు సంధించారు.

తాను ఇప్పటివరకు 45 కంప్లైంట్లు చేశానని.. ఒక్క దానిపైనా కేసు నమోదు చేయలేదన్నారు. ఇదేనా సంజయ్ నిబద్ధత? అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు.. అచ్చెన్నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నేతలపై నకిలీ లేఖలు.. వార్తల్ని క్రియేట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై చర్యలేవి? అని ప్రశ్నించారు. ‘సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు సంజయ్ సార్?’ అంటూ ప్రశ్నించారు.

మహిళలు అని కూడా చూడకుండా వంగలపూడి అనిత.. ఎమ్మెల్సీ అనురాధల మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్టు ఎందుకు చేయలేదు? అని అడిగిన వర్ల.. “న్యాయమూర్తుల్ని కించపరిచిన పంచ్ ప్రభాకర్ లాంటి వైసీపీ నేతల ఆస్తుల్ని ఎప్పుడు జఫ్తు చేస్తారు?” అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిగా అందరి విషయంలోనూ ఒకేలా రియాక్టు కావాలన్న వర్ల.. తాను ఇచ్చిన 45 ఫిర్యాదులపై చర్యల గురించి అడుగుతున్నారు.

అంతేకాదు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై ఫిర్యాదు చేయటానికి సంజయ్ సార్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదన్నారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఒక సామాజిక వర్గాన్ని కోరుతూ చంద్రబాబు లేఖ రాసినట్లుగా తయారుచేసిన నకిలీ లేఖను క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను మరో ఫిర్యాదును ఈ మొయిల్ ద్వారా సీఐడీ సంజయ్ కు పంపినట్లుగా చెప్పారు. మరి.. వర్ల రామయ్య ప్రశ్నలకు సీఐడీ చీఫ్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.