బీజేపీ తన గొయ్యి.. తానే తవ్వుకుంటుందా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ చెత్తను నెత్తినేసుకుంటుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. జనసేన అంటేనే సీమాంధ్ర పార్టీ అనే ముద్రుందన్న విషయం అందరికీ తెలుసు. జనాల్లో నిజంగానే అలాంటి ముద్ర ఉందో లేదో తెలీదు కానీ కేసీయార్ మాత్రం కచ్చితంగా ముద్రను వేయటం ఖాయం. గతంలో తెలుగుదేశంపార్టీపైన ఇలాంటి ముద్రేవేసి చంద్రబాబునాయుడును గబ్బుపట్టించేశారు.

ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత సీమాంధ్ర మూలాలున్న పార్టీలపై కేసీయార్ ఎంతలా ధ్వేషం వ్యక్తంచేశారో ? విషం చిమ్మారో అందరు చూసిందే. నిజానికి సీమాంధ్ర మూలాలున్న పార్టీలంటే 2014లో టీడీపీ, వైసీపీ మాత్రమే ఉన్నాయి. అప్పటికి జనసేన యాక్టివ్ గా లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో రెండుసారి గెలిచేందుకు కేసీయార్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుపెట్టుకున్నది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కేసీయార్ టీడీపీపైన జనాల్లో బాగా విధ్వేషాన్ని నింపారు. దాంతో టీడీపీతో పొత్తుపెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ పైన కూడా దెబ్బపడిపోయింది.

అప్పటినుండి సీమాంధ్ర ప్రాంత పార్టీలేవి తెలంగాణా వైపు చూడలేదు. ఇపుడు సమస్య ఏమిటంటే జనసేన కాస్త యాక్టివ్ గా ఉంది. అందులోను బీజేపీతో తెలంగాణాలో పొత్తుకుంది. రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నాయి. అంటే సీమాంధ్రపార్టీ జనసేన తెలంగాణాలో పోటీచేయబోతోందన్నమాట. అందుకనే తమ రెండుపార్టీల తరపున పవన్ ప్రచారం చేస్తారని లక్ష్మణ్ చెపారు.

మరి పవన్ తో ప్రచారం చేయిస్తే కేసీయార్ ఊరుకుంటారా ? మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ప్రయోగించకుండా ఉంటారా ? అదే వర్కవుటైతే బీజేపీకి ఇపుడొస్తుందని అనుకుంటున్న సీట్లు వచ్చేది కూడా అనుమానమే. ఒక్క స్ధానంలో గెలవకపోయినా జనసేనకు కొత్తగా పోయేదేమీ లేదు. నష్టం ఏదన్నా జరుగుతుందంటే అది బీజేపీకి మాత్రమే. ఈ విషయాలు ఆలోచించుకునే పవన్తో బీజేపీతో ప్రచారం చేయించటానికి సిద్ధపడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ప్రచారం మొదలైన తర్వాత కదా ఏమవుతుందో తెలిసేది.