మద్యం కేసులోనూ చంద్రబాబు అరెస్టుకు హైకోర్టు నో

53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేవలం చికిత్స కోసం కండిషనల్ బెయిల్ మంజూరు చేశామని పలు షరతులను చంద్రబాబుకు హైకోర్టు విధించింది. మరోవైపు, మద్యం షాపుల కేటాయింపులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ముందస్గు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు చంద్రబాబుకు మరో ఊరటనిచ్చింది. చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. అయితే, స్కిల్ కేసులో హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ చంద్రబాబును మరే కేసులోనూ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు.

ఈ కేసులో నవంబర్ 15న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. అప్పటివరకు వేరే ఏ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని, హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని చెప్పారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ ను హైకోర్టు రికార్డు చేసింది. కాగా, చంద్రబాబుపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తాజాగా మద్యం అంశంలో ఏదో జరిగిందంటూ మరో కేసు పెట్టారని ధూళిపాళ్ల ఆరోపణలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ కార్పొరేషన్ ఎండీ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. దానిని బట్టి ఇది కావాలని పెట్టిన కేసు అని అర్థమవుతోందని స్పష్టం చేశారు.