ట్రెండ్ : కొత్త ఓటర్లకు బూట్లు,స్మార్ట్ వాచీలు

తొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో కొత్త ఓటర్లపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టినట్లున్నాయి. కొత్త ఓటర్లంటే ఎక్కువగా యూత్ మాత్రమే ఉంటారనటంలో సందేహంలేదు. అందుకనే యూత్ ను ఆకట్టుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై మూడుప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దృష్టిపెట్టాయి. యూత్ ను ఆకర్షించేందుకు అవసరమైన హామీలు ఇవ్వటం, క్రికెట్ కిట్లు, స్మార్ట్ వాచీలు పంపిణీ, ఖరీదైన టీ షర్టులు, కాస్ట్లీ షూస్ లాంటి వాటితో పార్టీలో ఎరవేస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.

మూడు పార్టీల మధ్య పోటీ చాలా టైట్ గా ఉండబోతోందనే అంచనాలు అందరికీ తెలిసిందే. ఫైట్ ఎంత టైట్ గా ఉన్నా గెలిచేది మాత్రం ఒకళ్ళే. ఆ ఒకళ్ళు ఎవరో ఇపుడు తెలీదు కాబట్టే అభ్యర్ధులందరు చాలా టెన్షన్ తో ఉన్నారు. గెలుపు టార్గెట్ గా అభ్యర్ధులు తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లో ప్రచారాలు, హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారం ప్రతి నియోజకవర్గంలోను సుమారు 15 వేల మంది కొత్త ఓటర్లున్నారు.

కొత్త ఓటర్లలో కూడా యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి యూత్ అసోసియేషన్ల నేతలపైన ఎక్కువగా దృష్టి పెట్టాయి. యూత్ ను ఆకట్టుకోవటంలో బాగంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ప్రకటిస్తామని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని పదే పదే పార్టీలు హామీలిస్తున్నాయి. నిరుద్యోగుల సంఖ్య సుమారు 40 లక్షలుంటుందని అంచనా. నిరుద్యోగుల్లో మొదటి సారి ఓటర్లుండరు కానీ వీళ్ళ ఓట్లు కూడా చాలా కీలకమనే చెప్పాలి.

యువతను ఆకట్టుకుంటే వాళ్ళే మిగిలిన వాళ్ళ ఓట్లను కూడా తీసుకొస్తారని పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకనే స్మార్ట్ వాచీలు, ఖరీదైన బూట్లు, టీ షర్టులు, క్రికెట్ కిట్లు అందిస్తున్నాయి. కొన్ని చోట్లయితే కొందరు యూత్ ను పోగేసి విహారయాత్రలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. ప్రతి నియోజకవర్గంలో మొదటిసారి ఓట్లేసే వాళ్ళ సంఖ్య 5 వేల నుండి 15 వేలమందంటే చిన్న విషయం కాదు. టైట్ ఫైట్లో గెలుపోటములను చాలా తక్కువ ఓట్లే డిసైడ్ చేస్తాయని అందరికీ తెలిసిందే. అందుకనే యూత్ పైన ఎక్కువగా పార్టీలు దృష్టిపెట్టాయి.