బీజేపీ-జనసేనలో గొడవలు పెరిగిపోతున్నాయా ?

రెండు పార్టీలు బీజేపీ-జనసేన మధ్య పొత్తు గొడవలు పెరిగిపోతున్నాయి. రెండుపార్టీలు తెలంగాణా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని పై స్ధాయిలో నిర్ణయం తీసుకున్నా కిందస్ధాయికి సరిగా వెళ్ళలేదు. చివరి నిముషంలో పొత్తు పెట్టుకోవటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్ళుగా టికెట్లు ఆశించి బీజేపీ నేతలు బాగా కష్టపడ్డారు. అయితే చివరి నిమిషంలో జనసేనతో పొత్తు కుదిరింది. జనసేన ఒంటరిగానే 32 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణే ప్రకటించారు.

రెండుపార్టీలు వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్న సమయంలో సడెన్ గా పొత్తు కుదిరింది. దాంతో జనసేన ముందుగా ప్రకటించినట్లు కాకపోయినా కనీసం 20 సీట్లయినా ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. బీజేపీనేమో జనసేనకు పదిసీట్లివ్వటమే చాలా ఎక్కువనే అభిప్రాయంతో ఉంది. పైగా రెండు పార్టీల నేతలు దృష్టిపెట్టిన నియోజకవర్గాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఈ విషయంలోనే రెండుపార్టీల నేతల మధ్య ఎక్కడా సయోధ్య కుదరటంలేదు.

శేరలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో పోటీచేయటానికి రెండుపార్టీల నేతలు బాగా పట్టుగున్నారు. పై రెండు నియోజకవర్గాల్లో పోటీ విషయంలో బీజేపీ నేతలు చాలాకాలంగా కష్టపడుతున్నారు. చివరినిముషంలో వీటిని జనసేకు వదులుకోవటానికి కమలనాదులు ఇష్టపడటంలేదు. దాంతో రెండుపార్టీల్లోను గొడవలవుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు వదులుకోవటాన్ని సీనియర్ నేత, పార్లమెంటుకు పోటీచేయాలని ఆలోచిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కొండా పోటీచేయాలని అనుకుంటున్న చేవెళ్ళ పార్లమెంటు సీటు పరిధిలోకే శేరిలింగంపల్లి వస్తుంది.

ఇంతకాలం గ్రౌండ్ వర్క్ చేసుకున్న వాళ్ళని కాదని పొత్తులో జనసేకు ఇచ్చేస్తే తన గెలుపుపైన తీవ్ర ప్రభావం పడుతుందని కొండా ఆదోళన పడుతున్నారు. కొండాకు మద్దతుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిలవటంతో పార్టీలో పెద్ద గొడవైపోతోంది. ఇలాంటివే మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి పొత్తున్నది పై స్ధాయిలో నిర్ణయం అయినంత సులభంకాదు కిందస్ధాయిలో నేతలు కలిసి పనిచేయటం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.