బాబు కోసం.. ఐటీ ఉద్యోగుల ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ స‌ర్కారు స్కిల్ కేసు న‌మోదు చేయ‌డం, ఆ వెంట‌నే ఆయ‌న‌ను జైలు త‌ర‌లించ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం 50 రోజుల‌కు పైగానే చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, చంద్ర‌బాబుకు మేలు చేయ‌డ‌మే తెలుసు కానీ.. అవినీతి చేయ‌డం తెలియ‌ని.. ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాబుకు ద‌న్నుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పోరుగు రాష్ట్రాల్లోనూ ఉద్య‌మాలు చేస్తున్నారు. ఆయ‌న మ‌ద్ద‌తుగా అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

తాజాగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మ‌రోసారి ఐటీ ఉద్యోగులు సంఘీభావ స‌భ‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మా నికి ఏపీ నుంచే కాకుండా.. బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.ఇ క‌, నంద‌మూరి కుటుంబం మొత్తం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు, అదేవిధంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు ఐటీ ఉద్యోగులు సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనూప్‌ రూబెన్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వ‌హించి.. టీడీపీ గీతాల‌ను ఆల‌పించింది. సైబర్‌ టవర్స్‌ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు అభిమానులతో గచ్చిబౌలి మైదానం నిండిపోయింది. సెల్‌ఫోన్ల లైటింగ్‌తో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు.