2జీ… 5జీ.. ఏది కావాలి? :  సెటైర్ల‌తో కుమ్మేసిన మోడీ

Modi

మాట‌ల మాంత్రికుడుగా.. విశ్వ‌గురువుగా ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌పై స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆయ‌న 2జీగా అభివ‌ర్ణించారు. అంతేకాదు.. ఇది కాలాతీత‌మైన ఫోన్‌.. అంటూ.. కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో బీజేపీ అంటే 5జీగా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు 5జీనే కోరుకుంటున్నార‌ని.. 2జీ అనేది ఎప్పుడో 2014లోనే ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని మోడీ వ్యాఖ్యానించారు.

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన `ఇండియా మొబైల్‌ కాంగ్రెస్` ఏడో ఎడిషన్‌ను మోడీ ప్రారంభించి.. ప్ర‌సంగించా రు. ప‌లువురు ముఖ్య పారిశ్రామిక వేత్త‌లు, దిగ్గ‌జ వ్యాపార వేత్త‌లు పాల్గొన్న ఈ స‌ద‌స్సులో మోడీ.. రాజ‌కీయ ప్ర‌సంగానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌పై ఆయ‌న విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీని ‘కాలం చెల్లిన ఫోన్‌’తో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014లోనే ప్రజలు 2జీ ఫోన్లను వదిలేసి.. దేశ గతిని మార్చే 5జీ(బీజేపీ)ని ఎంచుకున్నార‌ని.. ఇప్పుడు వారి క‌ల సాకారం అవుతోంద‌ని మోడీ చెప్పుకొచ్చారు.

‘‘కాలం చెల్లిన ఫోన్లలో స్తంభించిన స్క్రీన్లపై.. ఎన్నిసార్లు స్వైప్‌ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదు. రీస్టార్ట్‌ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టినా.. చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేయవు. గత ప్రభుత్వం (కాంగ్రెస్) కూడా అలాంటి స్థితిలోనే  ఉంది. 2014లోనే ప్రజలు అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నారు. ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం కల్పించారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదు. అదో పెను మార్పు’’ అని మోడీ వ్యాఖ్యానించారు.

త్వ‌ర‌లోనే 6జీ

ప్ర‌స్తుతం 5జీ సేవ‌ల‌ను ఈ ఏడాది చివ‌రి నాటికి దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్న ప్ర‌ధాని మోడీ.. త్వ‌ర‌లోనే 6జీ సేవ‌ల‌ను కూడా ప్ర‌జ‌లు ఆశ్వాదించే స‌మ‌యం వ‌చ్చేసింద‌న్నారు.  5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో భారత్‌ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరింద‌ని చెప్పారు.