ఒకే ఒక్క‌డు.. బీజేపీ రెండో జాబితా విడుద‌ల‌

AP Mithun Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ తాజాగా విడుద‌ల చేసిన రెండో జాబితాలో కేవ‌లం ఒకే ఒక్క‌పేరు క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. చాలా మంది నాయ‌కులు రెండో జాబితాలో త‌మ పేరు ఉంటుంద‌ని.. శుక్ర‌వారం ఉద‌యం నుంచి కూడా ఢిల్లీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న ఆందోల్‌, మ‌ల్కాజిగిరి వంటి వాటిలో త‌మ అదృష్టాన్ని ప‌రిశీలించుకుంటున్న అభ్య‌ర్థులు సెకండ్ లిస్ట్‌పై ఆశ‌లు భారీ గానే పెట్టుకున్నారు.

అయితే, అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కేవ‌లం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను విడుద‌ల చేసింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఒకే ఒక్క పేరుతో ఈ జాబితాను బీజేపీ సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిటీ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ స్థానం నుంచి ఏపీ మిథున్‌కుమార్ రెడ్డికి టికెట్ ఖ‌రారైంది. యువ నాయ‌కుడిగా ఇటీవ‌ల కాలంలో పేరు తెచ్చుకున్న మిథున్‌.. మాజీ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి కుమారుడు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. ఇప్ప‌టికే రెండో జాబితాపై ఆశ‌లు పెట్టుకున్న‌వారు తాజాగా విడుద‌ల చేసిన జాబితాపై పెద‌వి విరిచారు. ఏదో చేస్తార‌ని అనుకుంటే..ఏదో చేశార‌ని.. కొంద‌రు వ్యాఖ్యానించారు. మ‌రోవైపు.. తొలి జాబితా అనంత‌రం అభ్య‌ర్థుల అసంతృప్తి పెల్లుబుక‌డంతో బీజేపీ అగ్ర‌నేత‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని.. అందుకే రెండో జాబితాలోనూ ప్ర‌ధానంగా ఎవ‌రికీ ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని.. మ‌రో జాబితాను వారంలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కాగా, న‌వంబ‌రు 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.