కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా… భలే ఉన్నారే!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర విజయవంతం కావడంతో పార్టీలో కొత్త ఉత్సాహం నిండింది. మూడు రోజుల పాటు రామప్ప నుంచి ఆర్మూరు వరకు సాగిన బస్సు యాత్రలో రాహుల్ గాంధీ ప్రజలతో సాగుతూ.. అధికార బీఆర్ఎస్ ను విమర్శిస్తూ సాగారు. దీంతో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో పార్టీకి మరింత భరోసా రావడంతో పాటు సీనియర్ నాయకులందరూ కలిసికట్టుగా సాగడం పార్టీకి మరింత ఉత్తేజాన్ని కలిగించేదే.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేధాలు తెలియంది కాదు. పార్టీలో ఓ నిర్ణయం తీసుకుంటే వినిపించే అసంత్రుప్తి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో కుంపటి మరింతగా రగులుతూనే ఉంది. సీనియర్ నాయకులంతా పార్టీలో ఆధిపత్యం కోసం పట్టుబడుతూనే ఉన్నారు. టికెట్ల కోసం గొడవ పడుతున్నారు. సీఎం పదవి కోసం ఆశ పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ ఏదైనా కార్యక్రమం చేపడితే నాయకులు తలో తీరుగా వ్యవహరిస్తుంటారనే సంగతి తెలిసిందే. కానీ ఇటీవల రాహుల్ గాంధీ బస్సు యాత్రలో మాత్రం సీనియర్ నాయకులందరూ కలిసి కట్టుగా సాగడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతోంది. సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, సుదర్శన్ రెడ్డి తదితరులు రాహుల్ బస్సు యాత్రలో కలిసి కనిపించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సీనియర్ నాయకులు ఇలాగే కలిసి పార్టీ కోసం పని చేస్తే కాంగ్రెస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.