తెలంగాణ రాకుంటే కేసీఆర్ బిచ్చమెత్తుకునేటోడు: రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో, బిర్లా మందిర్ వద్దో బిచ్చమెత్తుకునేటోళ్లు అని రేవంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ రాకపోతే అమెరికాలో కేటీఆర్ బాత్రూమ్ లు కడుక్కునేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నో ఆశలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ నట్టేట ముంచారని, అయినా సరే మూడో సారి సీఎం అయి ప్రజలను దోచుకోవాలని కలలు కంటున్నారని విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలు, వేలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎవరని అడుగుతున్న కేటీఆర్ ఒక సన్నాసి అని, ఈ దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు తెలుసుకోవాలని హితవు పలికారు. గాంధీ కుటుంబానికి ఇళ్లు లేవని, పదేళ్లలో ఫామ్ హౌస్ లు కట్టుకున్న చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని విమర్శలు గుప్పించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మోసం చేసి నట్టేట ముంచారని, 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదాపడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే అభాండాలు వేస్తున్నారని ప్రవళిక ఆత్మహత్య గురించి ప్రస్తావించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అడుగుతున్నారని, శంషాబాద్ ఎయిర్ పోర్టు మొదలు ఔటర్ రింగు రోడ్డు ఇచ్చారో సన్నాసోడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.