బాల‌య్య‌పైనే టీడీపీ ఆశ‌లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. అన్ని పార్టీలూ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ‌తో త‌మ‌కు పేగు బంధం ఉంద‌న్న తెలుగు దేశం పార్టీ మాత్రం ఇప్ప‌టికైతే.. ఉలుకు ప‌లుకు లేకుండా ఉంది. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌కు స్పందిస్తున్న తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వ‌ర్ మాత్రం 119 సీట్ల‌లో బ‌ల‌మైన 87 స్థానాల్లో తాము అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశామ‌ని.. చంద్ర‌బాబు ప‌చ్చ జెండా ఊపితే.. వారిని ప్ర‌క‌టించి బీఫారాలు కూడా అందించేందుకు రెడీగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదేస‌మ‌యంలో త‌మ త‌ర‌ఫున న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌చారం చేస్తార‌ని కూడా కాసాని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం పార్టీ అధినేత చంద్ర‌బాబు రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు. ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా స‌మ‌యం లేదు. ఆయ‌న బెయిల్‌పై విడుద‌ల కావాల‌ని.. పార్టీ వ‌ర్గాలు కోరుకుంటున్నాయి. అయితే.. ఈ ప్ర‌క్రియ అదిగో ఇదిగో అంటూ.. ముందుకు సాగ‌డం లేదు. మ‌రోవైపు.. ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు ప‌ట్టుమ‌ని మరో 20 రోజ‌లు స‌మ‌యం మాత్ర‌మే ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇటు టికెట్లు ప్ర‌క‌టించ‌డం.. అటు.. ప్ర‌చారం వంటి కీల‌క విష‌యాల్లో తెలంగాణ టీడీపీ ఒకింత వెనుక బ‌డింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. బాల‌య్య‌పైనే ఆశ‌లు పెట్టుకున్నా.. ఆయ‌న ప్ర‌చారానికి దిగినా.. ఏమేర‌కు ఆయ‌న ప్ర‌చారం పార్టీని గ‌ట్టెక్కిస్తుంద‌నేది కూడా ప్ర‌శ్న‌గా మారింది. 2018 ఎన్నిక‌ల్లో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని బాల‌కృష్ణ ఐదు రోజుల పాటు త‌న సోద‌రుడి కుమార్తె.. నంద‌మూరి సుహాసిని పోటీ చేసిన‌.. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేశారు.

కానీ, అక్క‌డ ఆమె విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. అయితే, గౌర‌వ ప్ర‌ద‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నారు. మ‌రి ఇప్పుడు బీఆర్ ఎస్ దూకుడు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల నేప‌థ్యానికి తోడు.. టీడీపీతో ఏపీలో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ్ర‌ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ ముమ్మ‌రం చేయ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో బాల‌య్య ప్ర‌చారంపైనే ఆధార ప‌డిన టీడీపీ ఏమేర‌కు నెగ్గుకొస్తుంద‌నేది చూడాలి. ఇక‌, మేనిఫెస్టో విష‌యంపై తెలంగాణ టీడీపీ ఇప్ప‌టికీ దృష్టి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.