విపక్షాలకు సైతం రాజుగారు.. వైసీపీలో మాత్రం పేదవారు

వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలలో రఘురామకృష్ణం రాజు రూటే వేరు. అందుకే ఆయనంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా జగన్ బ్యాచ్ అందరికీ మంట. రఘురామకృష్ణంరాజు నిత్యం సొంత పార్టీ చేసే తప్పులను ఎండగడుతూ వారికి మంచిమాటలు చెప్తుంటారు. అయినా, వినకపోతే మీ ఖర్మ అంటూ.. రాష్ట్రానికి మంచి చేసేది చంద్రబాబేనంటూ ఆయన్ను గౌరవిస్తుంటారు.

ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ అక్కడున్న తెలుగువారికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సాయపడుతుంటారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ విమానాశ్రయానికి వెళ్లి మరీ ఆయనకు స్వాగతం పలికి మర్యాదలు చేస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో న్యాయం పోరాటం చేస్తున్న చంద్రబాబు తనయుడు లోకేశ్‌కూ రఘురామ రాజు అండగా ఉంటున్నారు.

ఢిల్లీలో లోకేశ్‌కు ఎలాంటి అవసరం వచ్చినా చూసుకునేందుకు ఆ పార్టీ ఎంపీలు నలుగురు ఉన్నప్పటికీ వారితోపాటూ నేనూ ఉన్నానంటూ రఘురామరాజు కూడా లోకేశ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే, లోకేశ్ వెంట రఘురామ కనిపిస్తున్నారు.

ఒక్క లోకేశ్‌కే కాదు తెలుగువారికి ఎవరికైనా సరే రఘురామ ఆపదలో అండగానే నిలుస్తుంటారు. అంతెందుకు… దాదాపు నాలుగేళ్లుగా ప్రతిరోజూ రచ్చబండ పేరుతో తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టే రఘురామ రాజు అక్కడికి వచ్చే జర్నలిస్టులు, ఇతరులను గౌరవంగా చూసుకుంటారని చెప్తారు. తనకు వ్యతిరేకంగా రాసీ మీడియా నుంచి వచ్చినవారైనా.. తనపై నిత్యం విమర్శలు చేసే సొంత పార్టీ ఎంపీలకు అనుకూలంగా ఉండేవారైనా.. ఎలాంటి ప్రశ్న వేసినా ఏమీ అనకుండా తనదైన శైలిలో హాస్యధోరణిలో సమాధానం చెప్తారని అంటారు.

ఒక్క తెలుగు నేతలతోనే కాదు… పార్లమెంటులో ఆయనకు అన్ని పార్టీల నాయకులతోనూ మంచి అనుబంధం కనిపిస్తుంది. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లకు చెందిన క్షత్రియ నేతలలో చాలామందికి రఘురామరాజు ఆప్తుడు. కేంద్రంలోని బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కూడా ఎప్పుడంటే అప్పుడు సంపాదించగలిగే శక్తి కూడా రఘురామరాజుకు ఉంది. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా అనేక మంది బీజేపీ పెద్దలతో రఘురామరాజుకు మంచి పరిచయాలున్నాయి.

రాజులంటేనే మర్యాదకు మారు పేరు. రఘురామరాజు కూడా అందుకు ఏమాత్రం తీసిపోరు. తన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి కడుపు నిండా మంచి భోజనం పెట్టి కానీ పంపించరని అంటారు. మంచి సినిమాలు, మంచి పాటలు అంటే తెగ ఇష్టపడే రఘురామరాజు ఆ విషయాలు కూడా తన చుట్టూ ఉండేవారితో పంచుకుంటుంటారు. సరదా సంభాషణలు, ప్రజల కోసం సీరియస్‌గా ఆలోచించే పనితీరు, సొంత పార్టీవారు తప్పు చేసినా అప్రమత్తం చేసే ఈ నాయకుడిని వైసీపీ ఎందుకు వదులుకుందో అంటుంటారు ఆయనతో పరిచయం ఉన్నవారు.