మైనంపల్లి.. పంతం నెగ్గింది కానీ పరీక్ష మిగిలింది

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పంతం నెగ్గించుకున్నారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం పదవిని కూడా పణంగా పెట్టి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మైనంపల్లి పంతం నెగ్గించుకున్నారు. తన కొడుకుతో పాటు తనకు కాంగ్రెస్ టికెట్లు వచ్చేలా చూసుకుని ఎన్నికల సమరానికి సై అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లితో పాటు ఆయన తనయుడు రోహిత్ రావుకు టికెట్లు దక్కాయి. మైనంపల్లికి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, రోహిత్కు మెదక్ సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో మైనంపల్లి సంతోషంలో మునిగిపోయారు. కానీ ఆయనకు అసలు పరీక్ష ఇప్పుడు ఎదురు కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి వచ్చే ఎన్నికల్లోనూ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే వారనే చెప్పాలి. పైగా హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మైనంపల్లికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. కానీ రోహిత్ కు మెదక్ సీటు ఇవ్వాలని పట్టుబట్టిన ఆయన ఆశభంగంతో బీఆర్ఎస్ను వీడారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల సమరంలో అధికార బీఆర్ఎస్ ను దాటి తాను గెలవడంతో పాటు తన కొడుకును గెలిపించుకోవడం అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కేసీఆర్ నిర్ణయాన్నే ఎదురించి పార్టీని మారినందుకు మైనంపల్లిని దెబ్బకొట్టాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మల్కాజిగిరి మైనంపల్లి ఓటమి లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోందని తెలిసింది.

మరోవైపు మెదక్ లో బీఆర్ఎస్ తరపున పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆమెను తట్టుకుని అక్కడ రోహిత్ విజయం సాధించడం అంత సులువేం కాదు. పైగా రోహిత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న, మంచి వాగ్ధాటి ఉన్న పద్మా దేవేందర్ ను నిలువరించడం రోహిత్ వల్ల, మైనంపల్లి వల్ల అవుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి మైనంపల్లి తన సీటు నిలబెట్టుకోవడంతో పాటు రోహిత్ను గెలిపించుకుంటాడా అన్నది సందేహంగా మారింది. లేకపోతే రెండు చోట్లా ఓడిపోయి రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతారేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ పరిక్షలో మైనంపల్లికి ఎలాంటి ఫలితం దక్కుతుందో వేచి చూడాలి.