దుమ్మురేపేలా కేసీఆర్ ఎన్నిక‌ల మేనిఫెస్టో

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న రీతిలో ఎన్నిక‌ల క‌ద‌న‌రంగంలో దూక‌నున్నారు. నేడు పార్టీ కార్యాల‌య‌మైన‌ తెలంగాణ భవన్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయనున్న కేసీఆర్, పార్టీ తరపున ఎన్నికల ప్రచార ఖర్చులకు చెక్కులు ఇవ్వనున్నారు. దీంతోపాటుగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు కూడా. అయితే, మేనిఫెస్టో ఓట్ల వర్షం కురించేలా ప్లాన్ ఉండ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల్లో ఉన్న కాంగ్రెస్ 6 గ్యారెంటీలను మించి ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారి జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి టార్గెట్గా మేనిఫెస్టో ఉంద‌ని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని కేసీఆర్ అభ్యర్థులకు వివరించనున్నారు.

రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడమేలక్ష్యంగా దూకుడు పెంచిన గులాబీ సైన్యం ఇందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ప‌లు కీల‌క హామీల‌తో గులాబీ పార్టీ మేనిఫెస్టో ఉండ‌నుంది. ఆసరా, పెన్షన్లలో 2016 నుంచి 3016 కు పెంచనున్నారని స‌మాచారం. దివ్యాంగుల పెన్షన్ ను 4016 నుంచి 5016 కు పెంచే యోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం. కళ్యాణ లక్ష్మీ స‌హాయం 100116 నుంచి 200116 కు పెంచుతారని తెలుస్తోంది. అమ్మాయిలకు బస్‌ పాస్ ఫ్రీ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్తున్నారు. మహిళల కోసం వంట గ్యాస్ సిలిండర్ ధరలో 50 శాతం రాయితీ, మ‌హిళా సాధికారిత కోసం వారికి మహిళా బంధు లాంటి స్కీం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

సీనియర్ సిటిజన్స్ సంక్షేమం ..వృద్దులకు ఫౌష్టికాహారం అందించే పథకం మేనిఫెస్టోలో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రైతుబంధు పథకంలో ఎకరాకి 16 వేల వరకు పెంచే ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. పేద రైతులకు రెండు బస్తాల ఉచిత ఎరువులు, కౌలు రైతలకు ఆర్ధిక సహాయం, 50 ఏండ్లు దాటిన రైతులకు 2000 పెన్షన్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. పేదలకు వైద్య ఖర్చులకు పది లక్షల ఉచిత వైద్య బీమా పథకం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.నిరుద్యోగ భృతి పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

నేటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల విజయానికి కేసీఆర్ ప్రచారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 17 రోజుల్లో 42 సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న కేసీఆర్ హుస్నాబాద్ సభనుంచే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించ‌నున్నారు.

ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్. ఎన్నికల తేదీకి వందరోజుల ముందే అభ్యర్థుల ప్రకటన చేసి ప్ర‌చార ప‌ర్వంలో త‌న మార్కు వేసుకున్నారు. ఇక పార్టీ త‌ర‌ఫున మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్లు ఖరారు చేసిన‌ట్లు స‌మాచారం. నాంపల్లి, గోషా మాల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించి బీఫారాలు కేసీఆర్ ఇవ్వనున్నట్లు స‌మాచారం.