చంద్రబాబు జైల్లో ఉన్న జనంలో ఉన్నా ఒక్కటే: జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైలో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదని జగన్ షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదని, విశ్వసనీయత లేని ఆయన ఎక్కడున్నా ఒక్కటే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినపుడు పేదలకు, ప్రజలకు..ఆయన చేసిన మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు మాత్రమే గుర్తుకు వస్తాయని చురకలంటించారు. చంద్రబాబు మీద కక్ష లేదని, కక్షతో అరెస్టు చేయలేదు…చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో తాను లండన్ లో ఉన్నానని జగన్ అన్నారు.

ఒకవేళ అదే నిజమనుకుంటే….కేంద్రంలో బీజేపీ ఉందని, బీజేపీతో తానున్నానని దత్తపుత్రుడు అంటున్నాడని, సగం బీజేపీ టీడీపీ మనుషులేనని, కానీ, చంద్రబాబు అరెస్టుపై కేంద్రం స్పందించలేదని అన్నారు. కేంద్రంలోని ఈడీ, ఐటీ అధికారులు విచారణ జరిపి దోషులను అరెస్టు చేసిందని, బాబుకు ఐటీ నోటీసులిచ్చారని అన్నారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందని అన్నారు. ఆనాడే చంద్రబాబు అవినీతి గురించి మోడీ విమర్శలు చేశారని గుర్తు చేశారు. అవినీతి కేసుల్లో ఆధారాలు లభించినా చంద్రబాబును అరెస్టు చేయకూడదని…ఆయనను కోర్టు రిమాండుకు పంపకూడదని..ఎల్లో మీడియా వాదనలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సమర్థించడమంటే పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలకు సూచించారు.