నాగం త్యాగం చేశారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కచ్చితంగా నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వెనక్కి తగ్గారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు టికెట్ కోసం పట్టుబట్టిన జనార్ధన్ రెడ్డి ఇప్పుడు శాంతించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజేశ్ రెడ్డి కోసం జనార్ధన్ రెడ్డి టికెట్ వదిలేసుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నాగర్ కర్నూల్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి గెలిచారు. 1994 నుంచి 2012 ఉప ఎన్నికల వరకు వరుసగా అయిదు సార్లు ఆయనకు తిరుగన్నదే లేదు. కానీ 2014 నుంచి బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్ధన్ రెడ్డి అక్కడ మకాం వేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాగం ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా కాంగ్రెస్ టికెట్ కోసం పట్టుబట్టారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన జూపల్లి క్రిష్ణారావు నాలుగైదు టికెట్లు కావాలని కోరడం సరికాదంటూ నాగం సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగర్ కర్నూల్ ను వదిలేది లేదని చెప్పారు.

కానీ ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకున్న నాగం జనార్ధన్ రెడ్డి హైకమాండ్ సూచన మేరకు తగ్గారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. నాగం సమ్మతితోనే రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్ రెడ్డి విషయంలో నాగం జనార్ధన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో టికెట్ విషయంలోనూ నాగం తగ్గారనే చెబుతున్నారు. రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైన నేపథ్యంలో నాగం ఈ స్థానాన్ని త్యాగం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.