ఐటీ కంపెనీ పెట్టండి..జగనన్నకు చెబుతా: కేటీఆర్

సీఎం జగన్ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు పుణ్యమా అంటూ ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఇటువంటి నేపథ్యంలోనే సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

భీమవరం, నెల్లూరు వంటి ప్రాంతాలలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలని, కావాలంటే జగనన్నకు చెప్పి స్థలం ఇప్పిస్తానని ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన మాటల్లో తప్పేం లేదని, తెలంగాణతో పాటు ఏపీ అదే మాదిరిగా దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. బెంగళూరులో 40 శాతం మంది ఏపీ, తెలంగాణలకు చెందిన యువత ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారని, ఇక్కడే ఐటీ కంపెనీలు వస్తే వారంతా తమ స్వస్థలాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. వరంగల్ లో యువతకు వరంగల్ లోనే ఉద్యోగాలు దొరికే లాగా ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

దేశం అంతా బాగుండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, కులం, మతం అంటూ కొట్టుకుంటే ఏం వస్తుందని పరోక్షంగా బీజేపీకి కేటీఆర్ చురకలంటించారు. వాస్తవానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో తప్పుబట్టడానికి ఏమీ లేదు. కానీ, ఏపీలో స్వతహాగానే పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావాలి.