ప్ర‌తిప‌క్షాల దిమ్మ‌తిరిగే కేసీఆర్ మేనిఫెస్ట్ డిసైడ‌యింది

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో…కీల‌క నిర్ణ‌యాల‌తో క‌ద‌న‌రంగంలోకి దిగేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న కేసీఆర్ గులాబీ ద‌ళ‌ప‌తి హోదాలో రాబోయే ఎన్నిక‌ల‌కు ఎలాంటి హామీలు ఇవ్వ‌నున్నార‌నే ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంటుంది. ఆ ఉత్కంఠ‌ను బ్రేక్ చేసేందుకు డేట్ ఫిక్స‌యింది. ఈ నెల 16న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వ‌హించి మేనిఫెస్టో ప్రకటించ‌నున్నారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌, సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు వెల్ల‌డించారు.

టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగల్ లో మంత్రి హ‌రీశ్ రావు ప‌ర్య‌టిస్తున్నారు. నియోజకవర్గం ప‌రిధిలోని కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులు ప్రారంబించిన మంత్రి హరీష్ రావు ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి చేయ‌ట్లేద‌ని గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకున్నారని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక కోస్గిలో 50 పడకలు, మద్దూరులో 30 పడకల ఆస్పత్రిని నిర్మించామని తెలిపారు. పది సంవత్సరాలలో రేవంత్ ఒక్క దవాఖన తేలేదని, కానీ బీఆర్ఎస్ పాల‌న‌లో మూడు ఆస్పత్రులు వచ్చాయని గుర్తు చేశారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన అనంత‌రం ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చి దాహం తీర్చారని గుర్తు చేస్తూ…రేవంత్ ఉంటే ఇంకా పదేండ్లు అయిన నీరు రాకపోయేదని హ‌రీశ్ రావు తెలిపారు. మ‌ళ్లీ గెలిపిస్తే… కృష్ణమ్మ నీళ్లతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ పాదాలు తడుపుతామని హామీ ఇచ్చారు.

మూడు గంటల కరెంట్ కావాలి అంటే రేవంత్ కు… 24 గంటల కరెంట్, పాలమూరు నీరు కావాలి అంటే నరేందర్ రెడ్డి కి ఓటు వేయాలని హ‌రీశ్ రావు పేర్కొన్నారు. రేవంత్ కు ఓటేస్తే కైలాసంలో పెద్ద పాము మింగినట్టేన‌ని హ‌రీశ్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ తప్పు చేసినందున విచారణ జరపాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఓటు కు నోటు ఉదంతాన్ని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. “విచారణ అయ్యేది ఖాయం.. జైలుకు పోయేది ఖాయం.” అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇవ్వడం చాతకాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో హామీలు ఇచ్చి ప్ర‌కారం అమ‌లు చేస్తుందా అని హ‌రీశ్ ప్ర‌శ్నించారు. బీజేపీ లేచేది లేదని, కాంగ్రెస్ గెలిచేది లేదని ఎద్దేవా చేశారు.

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం త‌మ ప్రభుత్వం కృషి చేస్తుందని హ‌రీశ్ రావు తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని పేర్కొంటూ అందులో మహిళలకు శుభవార్త ఉంటుందన్నారు.
బీఆర్ఎస్‌ మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని పేర్కొన్న హ‌రీశ్ రావు శుభవార్త వినడానికి ప్రజలందరు సిద్దంగా ఉండండి అని కోరారు. హ‌రీశ్ రావు కామెంట్ల నేప‌థ్యంలో… బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ప్ర‌జ‌ల‌లో ఆస‌క్తి మ‌రింత పెరిగిపోయింది.