లోకేష్ తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పోలీసుల సాయంతో ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. కానీ, వాటన్నిటిని అధిగమించి కదం తొక్కుతూ ముందుకు సాగిన లోకేష్ 200 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు తర్వాత పాదయాత్రకు లోకేష్ హఠాత్తుగా విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి పాదయాత్రను పునః ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఈ లోపు పాదయాత్ర పూర్తి చేసి ప్రజలతో మమేకం కావాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.

అయితే, తాజాగా లోకేష్ తన నిర్ణయం మార్చుకుని పాదయాత్రను వాయిదా వేశారు. టీడీపీ నేతలతో సమావేశమైన లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని వారంతా సూచించడంతో లోకేష్ అందుకు అంగీకరించారు. అక్టోబర్ మూడో తేదీన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్న నేపథ్యంలో లాయర్లతో ఢిల్లీలో చర్చలు జరిపేందుకు లోకేష్ అక్కడ ఉంటే బాగుంటుందని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. దాంతోపాటు, చంద్రబాబును మరిన్ని కేసులలో కస్టడీకి సిఐడి కోరుతోంది. దీంతో, మరికొద్ది రోజులపాటు చంద్రబాబు రిమాండ్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

ఈ పరిణామాన్నిటినీ లోకేష్ తో చర్చించిన తర్వాత పాదయాత్రను వాయిదా వేస్తే బాగుంటుందని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలోనే పాదయాత్ర చేయబోయే తేదీని లోకేష్ ప్రకటించనున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన లోకేష్ జాతీయ స్థాయిలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై గళం విప్పిన సంగతి తెలిసిందే. పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో భేటీ అయిన లోకేష్ జగన్ అక్రమాల గురించి వారికి వివరించారు.