నాలుగేళ్లు ఏం పీకావు జగన్?: మోత్కుపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మాజీ టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ పొలిటిషన్ మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఒక దుర్మార్గుడివి జగన్…చంద్రబాబు వంటి పెద్ద మనిషిని నిరాధార ఆరోపణలపై అరెస్టు చేసేందుకు నీకు సిగ్గు, బుద్ధి ఉన్నాయా?అంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

2018 ఎన్నికల సమయంలో ఇదే ఘాట్ దగ్గర తాను జగన్ గెలవాలని కోరుకున్నానని గుర్తు చేసుకున్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మైకంలోకి వెళ్లారని, ఇంటి నుంచి తల్లిని, చెల్లిని బయటకు పంపించేంతగా ఆ మైకం చేరుకుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని లేని రాజ్యాన్ని నడిపిస్తున్న జగన్ నియంత మాదిరిగా రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. 74 సంవత్సరాల పెద్దమనిషి, ఈ దేశానికి నాయకుడు, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జగన్ జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 371 కోట్లకు దిగజారుతారా అని ప్రశ్నించారు.

ఈ నాలుగేళ్లు ఏం పీకావని జగన్ ను మోత్కుపల్లి నిలదీశారు. చంద్రబాబు వయసుకు విలువ ఇచ్చి జగన్ వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, చంద్రబాబు అక్రమ అరెస్టును కేసీఆర్ ఖండించాలని కూడా మోత్కుపల్లి కోరారు. జగన్ మనిషిగా మారాలని, బటన్ ఒత్తి పాలన చేయడం కాదని హితవు పలికారు. జైలుకెళ్లిన జగన్ ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు గెలుస్తారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. రేపు రాజమండ్రి వెళ్లి భువనేశ్వరిని పరామర్శిస్తానని , ములాఖత్ కు అనుమతి దొరికితే చంద్రబాబును కలుస్తానని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద రేపు నిరాహార దీక్ష చేపడుతున్నానని ప్రకటించారు.