20 రోజులు వృధా అయిపోయిందా ?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలై ముగిసిపోయాయి. 18వ తేదీన మొదలైన సమావేశాలు 22వ తేదీన ముగిశాయి. జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లంటు నానా గోల జరిగింది. వీటికోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలంటు దేశ రాజకీయాల్లో నానా హడావుడి జరిగింది. దాంతో ఇండియాకూటమితో పాటు తెలంగాణాలో కేసీయార్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కేసీయార్ ఇబ్బందులకు కారణం ఏమిటంటే దాదాపు నెలరోజుల క్రితమే అభ్యర్ధులను ప్రకటించేయటం.

జమిలి ఎన్నికలన్నా, ముందస్తు ఎన్నికలన్నా, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తే కేసీయార్ బాగా ఇబ్బందులు పడేవారే. అయితే జమిలి లేదు, ముందస్తు ఎన్నికలు లేవు. మహిళా రిజర్వేషన్ అమలు కూడా 2029 ఎన్నికల నాటినుండే. నిజంగా పై మూడింటిలో ఏ ఒక్కటి వచ్చినా కేసీయార్ కు ఇబ్బందులు తప్పవన్నట్లే ప్రచారం జరిగింది. అయితే మూడింటిలో ఏదీ జరగకపోవటంతో రిలీఫ్ ఫీలయ్యారు. కాకపోతే సుమారు 20 రోజులల విలువైన సమాయం వృధా అయినట్లే అనుకోవాలి.

పై మూడు అంశాలు చర్చకు రాకుండా ఉండుంటే ఈపాటికే కేసీయార్ సుడిగాలి పర్యటనలు పూర్తి చేసుండేవారే. నిజానికి రోజుకు మూడు బహిరంగసభలను కేసీయార్ ప్లాన్ కూడా చేసుకున్నారు. అయితే వాటన్నింటిని రద్దుచేసుకున్నారు. కేసీయార్ ఏ స్ధాయిలో టెన్షన్ పడ్డారంటే తాను చెప్పేంతవరకు అభ్యర్ధుల్లో ఎవరినీ ప్రచారంకు కూడా వెళ్ళద్దని ఆదేశించారు. అభ్యర్ధులు ప్రచారంలోకి వెళిపోతే పార్లమెంటులో ఏదైనా నిర్ణయం జరిగితే అభ్యర్ధులు ఇబ్బందులు పడతారన్నది కేసీయార్ ఉద్దేశ్యం.

మొత్తానికి అలాంటి ఏమీ జరగకపోవటంతో కేసీయార్ ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే నష్టపోయిన 20 రోజుల సమయాన్ని ఇపుడు జెట్ స్పీడుతో కవర్ చేయాల్సుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముందస్తు ఎన్నికల అంశం ఇంకా సజీవంగానే ఉంది. ఎందుకంటే ఈ విషయంలో నరేంద్రమోడీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. మోడీ నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని డిసైడ్ అయితే అడ్డుచెప్పేవాళ్ళులేరు. అయితే మోడీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలీటంలేదంతే.