ట‌చ్ మీ నాట్‌… జ‌గ‌న్ ప‌ట్ల మోడీ ఫీలింగ్‌ మారుతోందా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్, అనంత‌ర ప‌రిణామాలు ఒకింత సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో చర్చనీయాంశంగా మారడంతో ఈ వివాదంలో జోక్యం చేసుకోవద్దని కాషాయ పెద్ద‌లు క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అధికార, రాజకీయప‌ర‌మైన‌ స్పందనల‌ విషయంలో బీజేపీ పెద్దలు సైలెంట్ మోడ్ లో ఉంటున్నారని, ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఒకింత దూరం పెడుతున్నార‌ని చెప్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ టూర్లో ఉన్న సమయంలో బాబు అరెస్టు, ఆయనకు బెయిల్‌ దొరకపోవడం, తాజాగా ప‌లు కేసుల్లో నిందితుడి అనే వార్త‌లు చర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ దూకుడు వెన‌క బీజేపీ అండ ఉంద‌న్న‌ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. బాబు అరెస్టు సమయంలో విదేశాల్లో ఉన్న జగన్ రాష్ట్రానికి విచ్చేయగానే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలవాలని తలచిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు వారం అవుతున్న‌ప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదు. దీని వెనుక ఢిల్లీ పెద్దలు బీజేపీ ముఖ్య నాయకుల వ‌ద్ద ఉన్న స‌మ‌చారం కారణమని అంటున్నారు.

చంద్రబాబు అరెస్టుని టీడీపీ దాని మిత్రపక్ష పార్టీలు కాకుండా ఏపీలోని ప్రజ‌లు సైతం ఈ చర్యను అవినీతిని అడ్డుకోవడం అనే కోణంలో కాకుండా పగ తీర్చుకోవడం అనే విధంగా చూస్తున్నాయని బీజేపీ నేతల దృష్టికి వచ్చింది. ఇదే స‌మాచారం ప్రధాని దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ అపాయింట్మెంట్ కోరినప్పటికి ప్రధాని నో చెప్తున్నట్లు సమాచారం. మోడీ క‌నుస‌న్న‌ల్లోనే లేదా మ‌ద్ద‌తులో బాబును జ‌గ‌న్ అరెస్టు చేయించాడ‌ని ఏపీలో బలంగా ప్రచారమయ్యే అవకాశం ఉంది కాబట్టి మోడీ, అమిత్ షాలు జ‌గ‌న్ తో ట‌చ్ మీ నాట్ అంటూ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీకి దగ్గర అయ్యేందుకు, బాబు అరెస్టును వాడుకునేందుకు జగన్ క్రేజీగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీకి మాత్రం అలాంటి ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.