రాసి పెట్టుకోండి… 160 సీట్లు ఖాయం..

వైసీపీ నుంచి స‌స్పెండ్ అయిన నెల్లూరు జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను గ‌తంలో చెప్పిన అనేక విష‌యాలు పొల్లు పోకుండా జ‌రిగాయ‌ని.. ఇప్పుడు కూడా అదేవిధంగా తాను అంచ‌నా వేసి.. కొన్ని విష‌యాలు చెబుతున్నానంటూ.. కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. 1999 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుంద‌ని చెప్పిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా టీడీపీ గెలిచింద‌న్నారు.

త‌ర్వాత వ‌చ్చిన 2004 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని తాను అంచ‌నా వేశాన‌ని, అదేవిధంగా కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కింద‌ని తెలిపారు. ఇక‌, 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ఓట్ల చీలిక కార‌ణంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ రెండోసారి అధికారం చేప‌డుతుంద‌ని తాను చెప్పిన‌ట్టు తెలిపారు. అనుకున్న విధంగానే అప్ప‌ట్లో కాంగ్రెస్ గెలిచింద‌న్నారు.

ఇక‌, 2014లో తాను వైసీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఆ ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి తాను చెప్పిన‌ట్టు కోటంరెడ్డి వివ‌రించారు. అనుకున్న విధంగానే వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచింద‌న్నారు. ఇక‌, కీల‌క‌మైన 2017 నంద్యాల ఉపఎన్నికలో టీడిపి 30,000 మెజారిటీతో గెలుస్తుంద‌ని జగన్ తో చెప్పిన‌ట్టు వివ‌రించారు. అదేవిధంగా జ‌రిగింద‌న్నారు.

ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో 130 పైన స్థానాలలో వైసీపీ గెలుస్తుంద‌ని తాను అంచ‌నా వేశాన‌ని, ఇదే విష‌యాన్ని అప్ప‌ట్లోనే జ‌గ‌న్‌కు చెప్పాన‌ని కోటంరెడ్డి వివ‌రించారు. అదే జ‌రిగింద‌ని తెలిపారు. ఇక‌, ఇప్పుడు 2024 ఎన్నిక‌ల‌పైనా త‌న‌కు అంచ‌నా ఉంద‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. జనసేన-టీడిపి కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందన్నారు. అదేవిధంగా ఎక్క‌డా లేని విధంగా ఈ రెండు పార్టీల కూట‌మికి 57% ఓటింగ్ శాతం వస్తుందని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని రాసి పెట్టుకోవాల‌ని ఆయ‌న సూచించారు.