ఐపీఎల్-2020: `బుడగ`లో చిక్కుకున్న బుకీలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనాదన్ టీ20 క్రికెట్ లోకి లేటుగా అడుగుపెట్టినప్పటికీ…బీసీసీఐ నిర్వహిస్తోన్న ఐపీఎల్ కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. బిగ్ బాష్ వంటి లీగ్ లతో పోలిస్తే ఐపీఎల్ సక్సెస్ రేట్ తో పాటు ఆదాయం కూడా ఎక్కువే. అందుకే, ఐపీఎల్ వస్తోందంటే చాలు అందులో పాల్గొనే ఆటగాళ్లతోపాటు…ఆయా ఫ్రాంచైజీలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉత్సాహం కనిపిస్తుంది. వీరితోపాటు, ఐపీఎల్ కోసం బెట్టింగ్ రాయుళ్లు, బుకీలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. గతంలో ఓ సారి ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వెలుగు చూసినప్పటి నుంచి బీసీసీఐతోపాటు ఐసీసీ కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అయితే, ప్రతి సీజన్ లోను ఏదో ఒక రూపంలో గుట్టు చప్పుడు కాకుండా…..బుకీలు ఆటగాళ్లను సంప్రదిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ రాకెట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్ పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలోనే సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2020పై బుకీలు, గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశల మీద కరోనా నీళ్లు చల్లిందని, ఈ సారి బుకీల పప్పులు ఉడకవని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ప్రధాన అధికారి అజిత్ సింగ్ అన్నారు.

బయో సెక్యూర్ బబుల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవడం అసాధ్యమని, ఇటువంటి నేపథ్యంలో ఆటగాళ్లను బుకీలు సంప్రదించే సాహసం చేయరని అంటున్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్-2020 బయో సెక్యూర్ బబుల్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలో ఐపీఎల్-2020లో పాల్గొనే 8 జట్లకు చెందిన ఆటగాళ్లంతా బయో సెక్యూర్ బబుల్ లో ఉంటారు. ఈ విధానంలో ఆటగాళ్లను, జట్టు సిబ్బంది, యాజమాన్యానికి చెందిన వ్యక్తులంతా దాదాపుగా క్వారంటైన్ లో ఉంటారు. కాబట్టి, వారిని బయటి వ్యక్తులు కలిసేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లను బుకీలు కలవడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ల ఊసే ఉండకపోవచ్చని అజిత్ సింగ్ అంటున్నారు. సాధారణంగా ఫ్యాన్స్, ప్రేక్షకుల రూపంలో స్టేడియాలకు వచ్చిన బుకీలు…ఆటగాళ్లను సంప్రదించే ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. తమ కళ్లుగప్పి బుకీలు ఎవరైనా ఆటగాళ్లను కలవడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని, బయో సెక్యూర్ బబుల్ బుకీల పనిని మరింత కష్టసాధ్యం చేసిందని అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లను బుకీలు సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదిస్తుంటారన్న ఆరోపణలున్నాయని, వాటిపై తాము నిఘా పెట్టామని అన్నారు. ఐసీసీ ప్రధాన కేంద్రం దుబాయ్ లో ఉందని, అవసరమైతే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఏదో ఒక స్థాయిలో బెట్టింగ్, ఫిక్సింగ్ జరుగుందనే ఆరోపణలు, విమర్శలు సోషల్ మీడియా వస్తున్నాయి. గతంలో కొందరు ఆటగాళ్లు దొరకడం, సీఎస్ కే, ఆర్ ఆర్ లపై రెండేళ్ల నిషేధం ఆ ఆరోఫణలకు బలం చేకూరుస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. ఈ సారి కరోనా పుణ్యమా అని ఏర్పాటు చేసిన బయో సెక్యూర్ బుడగలో బుకీలు బుక్ అయ్యారరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.