జగన్ పల్లెబాట

అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నెలాఖరునుండి జగన్మోహన్ రెడ్డి పల్లెబాట పట్టబోతున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జగన్ చాలాకాలంగా అనుకుంటున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతోంది. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నెలాఖరులో పల్లెబాట పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రతి సచివాలయానికి జగన్ ఒకరోజు కేటాయించారు. అదికూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామసచివాలయాలకు ప్రాధాన్యతివ్వబోతున్నారట.

ప్రతి మండలంలోను సాయంత్రం మీటింగ్ పెట్టుకుని రాత్రి మండలకేంద్రంలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మండలంలోని ప్రముఖులతో రాత్రి భేటీ అవుతారు. ఉదయం నుండి సాయంత్రంవరకు ప్రజా సమస్యలపై ముఖాముఖి ఉండబోతోంది. రాత్రి నుండి కొద్దిసేపు మండలంలోని ప్రముఖులు, ముఖ్యంగా తటస్తులతో భేటీలు ఉంటాయని పార్టీవర్గాల సమాచారం. ఈ కార్యక్రమంలోనే నేతల మధ్య ఉన్న అంతరాలను తొలగించటం, కీలకమైన ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడటం వల్ల పార్టీలో నూతన ఉత్సాహం వస్తుందని జగన్ అనుకుంటున్నారట.

పనిలో పనిగా కొత్తగా పార్టీలో చేరదలచుకున్న ఇతర పార్టీల్లోని నేతలను, తటస్తులకు కూడా ఆహ్వానించబోతున్నారు. దీనివల్ల పార్టీ మరింతగా బలోపేతమవుతుందని అనుకుంటున్నారు. గ్రామంలోనే భోజనాలు చేయబోతున్నారు. కాబట్టి జనాలతో డైరెక్టు టచ్ వస్తుందని అనుకుంటున్నారు. అలాగే వివిధ సంక్షేమ పథకాలకు సంబందించి గ్రామంలోని లబ్దిదారులతో కూడా మాట్లాడుతారు. ప్రతి గ్రామంలోను వీలుంటే మండల హెడ్ క్వార్టర్స్ లో పథకాల లబ్దిదారులతో ముఖాముఖి అవటం వల్ల పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు.

ఏదేమైనా ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టినా రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి వీలైనంత కాలం ప్రజల్లో ఉండటానికే జగన్ ప్రధాన్యత ఇస్తున్నారు. సంక్షేమపథకాల లబ్దిదారులను వీలైనంతగా కలవటానికే జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వంలో మంచి జరిగిందని అనుకుంటేనే తనకు ఓట్లేయమని జగన్ చెబుతున్నారు. కాబట్టి అదే స్లోగన్ తో డైరెక్టుగా జనాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి జనాలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిందే.