టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై కక్ష కట్టిన వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అన్యాయంగా ఆయనను అరెస్టు చేసిందని జాతీయ స్థాయి నేతలు కూడా విమర్శలు గుప్పిం చారు. మరికొందరైతే, బీజేపీ ప్రోద్బలం లేకుండా కేంద్రంలోని పెద్దలకు సమాచారం లేకుండా చంద్రబాబు అరెస్టు జరగడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఖండించి వదిలేశారుగానీ టీడీపీ చేపట్టిన బంద్ కు జనసేన మిత్రపక్షమైన బిజెపి మద్దతును ప్రకటించలేదు. దీంతో, చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలున్నారు అన్న పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లయింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టు వ్యవహారం పై కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయపరంగా చంద్రబాబుతో కొట్లాడాలని, కానీ, ఇలా అరెస్టు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి వైసిపి తాను తీసుకున్న గోతిలో తానే పడిందని బండి సంజయ్ విమర్శించారు. ఏపీలో వైసీపీకి దరిద్రపు అలవాటు ఉందని, నిజం మాట్లాడితే తనను చంద్రబాబు ఏజెంట్ అంటారని విమర్శించారు.
వైసీపీ నేతలు ఏమైనా సుద్ధపూసలా అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి మైనస్ అని, ఈ వ్యవహారాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించాలని బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, ప్రజలు తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తుందని అన్నారు. మాజీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఆదరబాదరగా తెల్లవారుజామున అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు G20 సమావేశాలు జరుగుతున్న రోజే దొరికిందా అంటూ జగన్ సర్కారుపై, సీఐడీ అధికారులపై విమర్శలు చేశారు.
ఆ రోజు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, కానీ ఇరు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై ఫోకస్ చేశాయని, ఇక్కడ మీడియా కూడా జి20 పట్టించుకునే పరిస్థితిలో లేదని అన్నారు. ఇక, చంద్రబాబు అరెస్టుతో ఆయనకు ప్రజల్లో మైలేజీ పెరిగిందని అన్నారు. అయితే, తప్పు చేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ కాదనరని, కానీ, అరెస్టు చేసిన విధానం సరిగా లేదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates