క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని నోలన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే ఈ సినిమాను విజువల్ వండర్గా అభివర్ణిస్తూ.. నోలన్ మాస్టర్ స్టోరీ టెల్లింగ్ను కొనియాడుతూనే.. చరిత్రను ఇంకా బాగా చూపించి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 వేల కోట్లు పెట్టి తీసిన సినిమాలో ఇంకా గ్రాండియర్ ఉండాల్సిందని, యుద్ధ సన్నివేశాలను ఇంకా బాగా తీసి ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా చూసిన అనుభవంతో ఇండియన్ ఆడియన్స్ ‘ది ఒడిస్సీ’ నుంచి ఇంకా ఎక్కువ ఆశించి ఉంటారనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో వావ్ ఫ్యాక్టర్ అనుకున్న స్థాయిలో లేదనే మాట కూడా వినిపిస్తోంది.
చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న.. ‘ది ఒడిస్సీ’ విడుదలకు ముందు ఎంతో చర్చనీయాంశం అయిన ట్రోజన్ హార్స్ సన్నివేశాన్ని నోలన్ అనుకున్నంత రోమాంచితంగా తీయలేదనే అభిప్రాయం కూాడా వ్యక్తమవుతోంది. ఇదే సన్నివేశం రాజమౌళి చేతిలో పడుంటే.. థియేటర్లు ఉర్రూతలూగిపోయి ఉండేదనడంలో సందేహం లేదు. ట్రాయ్ రాజ్యంలోకి ప్రవేశించి దొంగ దెబ్బ తీయడం కోసం గ్రీకు రాజు వేసిన పన్నాగమే ఈ ట్రోజన్ హార్స్ వ్యూహం.
ఇందులో భాగంగా గ్రీకు రాజు ఆడిస్సియస్తో పాటు భారీ సంఖ్యలో సైనికులు ఒక భారీ చెక్క గుర్రాన్ని తయారు చేసుకుని దాని లోపల దాక్కుంటారు. తమ రాజ్యానికి సమీపంలో ఉన్న సముద్ర తీరంలో కనిపించిన ఆ గుర్రాన్ని ట్రాయ్ సైనికులు లాక్కొచ్చి తమ రాజ్యం మధ్యలో నిలబడతారు. రాత్రి ఆ గుర్రం నుంచి బయటికి వచ్చిన గ్రీకు రాజు సైనికులు.. ట్రాయ్ మీద మెరుపు దాడి చేస్తారు. అంతలోనే మిగతా గ్రీకు సైన్యం కూడా వీరికి తోడవడంతో ట్రాయ్ రాజ్యం కుప్పకూలుతుంది.
వినడానికే రోమాంచితంగా అనిపించే ఎపిసోడ్ ఇది. దీన్ని నోలన్ బాగానే తీశాడు కానీ.. ఇంకా ఉత్కంఠభరితంగా, భారీగా, రోమాంచితంగా, భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లేలా తెరకెక్కించడానికి స్కోప్ ఉంది. ఇదే సన్నివేశం రాజమౌళి తీసి ఉంటే.. అది వేరే లెవెల్లో ఉండేదని, ప్రేక్షకులు వెర్రెత్తిపోయేవారని అనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates