రాహుల్ కంటే కేసీఆర్ అడ్వాన్స్‌… అప్డేట్ అవ్వ‌మంటున్న క‌విత‌

kavitha

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ స‌హా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన బీజేపీ, కాంగ్రెస్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని ఆర్భాటంగా నిర్వ‌హిస్తూ దానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బీజేపీ నేత‌లు ర‌ప్పిస్తున్నారు. త‌ద్వారా బీజేపీ త‌మ ఎన్నిక‌ల‌ ప్ర‌చారాన్ని ప్రారంభిస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణ వేదిక‌గా ఎన్నిక‌ల సైర‌న్ మోగిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశౄరు.

మహిళ బిల్లుపై, రైతాంగ అంశాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల క‌విత నిల‌దీశారు. “రెండు రోజుల్లో మొత్తం గాంధీ పరివారం తెలంగాణకు వస్తుంది. నేను వాళ్లకు ఒకే ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా ? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా ? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాలు విసిరారు.

రాహుల్ గాంధీ అప్ డేట్స్ లేని అవుట్ డేటెడ్ నాయకుడని క‌విత సెటైర్ వేశారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరని అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఆపలేకపోతున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ హోదాను పొంద‌లేక‌పోతోంద‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తీరు గమ్మతిగా ఉంటుందని ఎద్దేవా చేశారు. “ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి పోడు పట్టాలు ఇస్తామంటున్నారు. వీళ్లు మారరా.? అప్ డేట్ కారా ? తెలంగాణ‌లో మొన్ననే అన్ని పోడు పట్టాలు ఇచ్చేశాము. మళ్లీ వాళ్లు వచ్చాక పోడు పట్టాలు ఇస్తారటా.” అని అన్నారు. దళితులకు మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తామని దళిత డిక్లరేషన్ లో ఎక్కడైనా పెట్టారా అని నిలదీశారు. మనం దళిత బంధు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లు రూ. 12 లక్షలు ఇస్తరట, కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని మండిపడ్డారు.

తాము ఏం ఇస్తుంటే దానికి ఇంకో రెండు ఎక్కెవ ఇస్తామని చెప్పడం తప్పా వేరే ముచ్చట లేదని కాంగ్రెస్ నేత‌లపై క‌విత సెటైర్లు వేశారు. డిక్లరేషన్ల పేరిట తెలంగాణలో ఇచ్చిన హామీలను ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్రానికి రావాలని సూచించారు. కాంగ్రెస్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయినందుకు దేశవ్యాప్తంగా ఆ పార్టీ తిరస్కరణకు గురయ్యిందని స్పష్టం చేశారు. దేశంలో తిరస్కరించిన పార్టీని మనం నమ్ముదామా అని ప్రశ్నించారు. గతంలో ప్రతీ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాలకే పరిమితమయ్యిందని చెప్పారు. ప్రజలను పీక్కతినడానికి వచ్చేవాళ్లే కాంగ్రెస్ నేతలని క‌విత‌ మండిపడ్డారు.