కేటీఆర్ సూటి ప్రశ్న.. జవాబు చెప్పలేని స్థితిలో కాంగ్రెస్, బీజేపీ!

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టాలంటే వాటి బలహీనతలను పసిగట్టాల్సి ఉంటుంది. ఆ బలహీనతలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటే, అప్పుడు అనుకున్న ఫలితం దక్కుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా అదే మార్గంలో సాగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీని సిద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా చెక్ పెడుతూ కేటీఆర్ సాగుతున్నారనే టాక్ ఉంది. తాజాగా సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీని కేటీఆర్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో చెప్పగలరా? అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆయా పార్టీల పరిస్థితి చూసే కేటీఆర్ సూటిగా ప్రశ్నించారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో సీఎం సీటు కోసం తీవ్రమైన పోటీ ఉందని అంటున్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు వచ్చే ఆస్కారముందనే ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు? అనేది అంతుపట్టడం లేదనే చెప్పాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు చూసేది సీఎం సీటు కోసమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణ బీజేపీలోనూ అదే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి సీటు కోసం కీలక నాయకుల మధ్య పోటీ ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, రఘు నందన్ తదితర నేతలు సీఎం కావాలనే ఆశతోనే ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కాంగ్రెస్లో కానీ లేదా బీజేపీలో కానీ ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు? అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఎన్నికల్లో ఈ పార్టీలు గెలిస్తే.. అప్పుడు ఢిల్లీలోని అధిష్ఠానం చెప్పిన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు.