జగన్ కు లోకేష్ మాస్ వార్నింగ్..బీ రెడీ!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ నకు నిరసనగా టీడీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బంద్ కు బీజేపీ మినహా జనసేన, సిపిఐ, సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేనతో పాటు బంద్ కు మద్దతు ఇచ్చిన మిగతా పార్టీలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన లోకేష్… చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాముకు తలలోనే విషం ఉంటుందని, కానీ జగన్ కు ఒళ్లంతా విషమే అని లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ చరిత్ర ఏంటో, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు అని బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి ఆ వివరాలను చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పై మొత్తం 38 కేసులు ఉన్నాయని, పదేళ్లుగా వాటికి సంబంధించి ట్రయల్ కూడా జరగడం లేదని లోకేష్ ఆరోపించారు.

వ్యవస్థలను జగన్ ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందని లోకేష్ విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ కంపెనీకి డబ్బులు వచ్చాయని ఆరోపిస్తున్నారని, కానీ ఏ రకంగా వచ్చిందో చెప్పలేకపోయారని అన్నారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 37వ పేరుగా చంద్రబాబును పెట్టి అరెస్ట్ చేశారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని ఆరోపించారు. పింక్ డైమండ్, వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో ఈ కేసులో అంతే అబద్ధం ఉందని లోకేష్ అన్నారు. చంద్రబాబుకు అవినీతి మరక వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వస్తే కర్నూలులో వైసీపీ నేతలు అడ్డంగా వాహనాలను నిలిపింది ఎవరినీ ప్రశ్నించారు. ఇది ఒక ఫేక్ కేసు అని, చంద్రబాబుకు డబ్బులు ముట్టినట్టు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో చూపించలేకపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు డిపార్ట్మెంట్ గా సిఐడి మారిపోయిందని లోకేష్ నిప్పులు చెరిగారు. ఇక, జగన్… చంద్రబాబుపై కేసులు పెట్టించి సైకోలా సంతోషపడుతుంటే రోజా వంటి మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని, దీన్ని బట్టి చంద్రబాబుపై వారు ఏ రకంగా కక్ష్య సాధిస్తున్నారో అర్థం అవుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.