చంద్రబాబును ఇరికించే ప్రయత్నం:  కోర్టులో లూథ్రా

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టుకు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని ఈ సందర్భంగా లూథ్రా పేర్కొన్నారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. సెక్షన్ 409 పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపించాలన్నారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు.

లూథ్రా నోటీసు మేరకు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. దీంతో సీఐడీ రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరించాలని లూథ్రా కోరారు. ఇక్కడ పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూథ్రా ప్రస్తావించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలన్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లోపు కోర్టులో హాజరు పర్చాలనే నిబంధనను సీఐడీ ఉల్లంఘించిందని లూథ్రా చెప్పారు.

చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని లూథ్రా న్యాయస్థానానికి తెలిపారు. కానీ సీఐడీ మాత్రం గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదనల సందర్భంగా లూథ్రా చెప్పారు. స్కిల్ స్కామ్ పేరిట కేసులు నమోదు చేయడం రాజకీయ ప్రేరేపితమని లూథ్రా అన్నారు. ఈ కేసులో బాబును ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా 409 సెక్షన్పై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం కేసు విచారణకు గంట పాటు భోజన విరామం ప్రకటించారు.