బ్రేకింగ్: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్

తన రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తారేమో అంటూ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే తాజాగా చంద్రబాబును నంద్యాలలో ఏపీ సిఐడి, సిట్ అధికారులు, పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏ-1గా ఉన్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హై డ్రామా నడిచింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించిన ఆధారాలు లేకుండా, ఆ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తనని ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఈ కేసుకు సంబంధించిన పేపర్లు ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిట్ అధికారులను, సిఐడి అధికారులను కోరారు. అయితే, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని, అరెస్టుకు గల కారణాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు పోలీసులు వివరించారు. ఆ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని కోర్టుకు వివరించామని వారన్నారు. అయితే, ఆ స్కామ్ లో తన పేరు ఎక్కడ ఉందో చూపించాలని చంద్రబాబు నిలదీశారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని లాయర్లు ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెప్పారు. చంద్రబాబు అరెస్టు నోటీసులు ఇచ్చామని, డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామని, 24 గంటల్లోపు చంద్రబాబు అరెస్టుకు గల కారణాలకు సంబంధించిన పత్రాలు ఇస్తామని పోలీసులు అంటున్నారు.

అయితే, అవగాహన లేకుండా చంద్రబాబు లాయర్లు వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు ఆరోపించగా…పోలీసులు తీరే అవగాహన లేకుండా ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర హైడ్రామా నడుస్తుంది. ఆ ప్రాంతానికి డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘురారెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు చేరుకున్నారు. అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నారని వార్త తెలుసుకున్న వేలాది మంది టిడిపి కార్యకర్తలు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు.

ఆ తర్వాత చంద్రబాబు ఉన్న బస్సు డోరును పోలీసులు పదే పదే కొడుతూ ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, చంద్రబాబును కలవకుండా లాయర్లు, టీడీపీ నేతలు, కార్యకర్తలు..పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టిడిపి నాయకులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్నారని, ఉదయం ఆరు గంటల తర్వాత చంద్రబాబును కలవాలని అరెస్టు చేసేందుకు వచ్చిన సిట్ అధికారులు, పోలీసులకు చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్పడంతో పోలీసులు ఆరు గంటల వరకు వెయిట్ చేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు హైడ్రామా మధ్య శనివారం ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టున టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. శనివారం, ఆదివారం కోర్టుకు సెలవలు కావడంతోనే కావాలని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టాలని జగన్ భావిస్తున్నారని, అందుకే ఆయననను అరెస్టు చేసి సైకో ఆనందం పొందుతున్నారని అంటున్నారు. చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.