పులివెందుల‌పై వాళ్లు.. కుప్పంపై వీళ్లు..

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య పంతాలు, పట్టింపులు మ‌రింత పెరుగుతున్నాయా? ఏకంగా ఆయా పార్టీల అధినేత‌ల‌ను ఓడించేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అధికారంలో ఉన్న వైసీపీ.. ప్ర‌తిప‌క్ష టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఓడించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో వైసీపీ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిం ది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని మినీ మునిసిపాలిటీగా ప్ర‌క‌టించింది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఏకంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మే అన్న‌ట్టుగా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, చిత్తూరు పార్ల‌మెంటు స‌భ్యు డు రెడ్డ‌ప్ప అయితే… వారానికి మూడు సార్లు కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇలా.. మొత్తంగా కుప్పంలో బాబును ఓడించాల‌నే ల‌క్ష్యంతో వైసీపీ దూకుడుగా ఉంది.

క‌ట్ చేస్తే.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో మ‌ట్టి క‌రిపించి .. సైకిల్‌ను ప‌రుగులు పెట్టించాల‌నేది టీడీపీ వ్యూహంగా ఉంది. దీంతో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయకుడు బీటెక్ ర‌వి.. జోరుగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి వివేకా హ‌త్య‌, జ‌గ‌న్ కుటుంబం లో వివాదాలు, ష‌ర్మిల‌కు అన్యాయం చేశార‌ని.. ఇలా ప్ర‌చారాన్ని జోరెత్తిస్తున్నారు. అయితే.. అటు కుప్పంలో అయినా.. ఇటు పులివెందుల‌లో అయినా.. ఇరు వ‌ర్గాల ప్ర‌చారం తార‌స్థాయిలోనే ఉంది.

ఇక‌, వాస్త‌వం జోలికి వ‌స్తే.. ఇటు కుప్పంలో చంద్ర‌బాబు హ‌వాను, అటు పులివెందుల‌లో సీఎం జ‌గన్ హ‌వాను కూడా త‌క్కువ‌గా చూడ‌లేం. ఎవ‌రు ఎంత వ్య‌తిరేక ప్ర‌చారం చేసినా.. కొన్ని ద‌శాబ్దాలుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు.. వారికే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సో.. ఎంతగా ఇప్పుడు ఈ రెండు పార్టీలు.. త‌లోచోట ప్ర‌త్య‌ర్థి పార్టీల అధినేత‌ల‌ను త‌ల‌కిందులు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా.. కొంత వ‌ర‌కు మెజారిటీ త‌గ్గించ‌వ‌చ్చేమో కానీ.. గెలుపును మాత్రం ఆప‌లేర‌నేది విశ్లేష‌కుల మాట‌. అంతేకాదు.. ఈ రెండు పార్టీలు కూడా.. కేవ‌లం ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై పెడుతున్న ఇంట్ర‌స్ట్‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌పై పెడితే ఫ‌లితం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.