మైనంపల్లి పంతం నెగ్గింది.. కానీ

తన తనయుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పంతం నెగ్గించుకున్నట్లే. కొడుకు రోహిత్ను మెదక్ నుంచి పోటీ చేయించేందుకు మైనంపల్లికి మార్గం సుగమమమైంది. కానీ అది బీఆర్ఎస్ నుంచి మాత్రం కాదు. కాంగ్రెస్ నుంచి. అవును.. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. అందుకు ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 17న నిర్వహించే బహిరంగ సభలో హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలిసింది. మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుక్కి టికెట్ ఇస్తామని చెప్పడంతోనే మైనంపల్లి కాంగ్రెస్లో చేరుతున్నారని సమాచారం.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా తనతో పాటు తన కొడుకును కూడా నిలబెట్టాలని ముందు నుంచే మైనంపల్లి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్లో రోహిత్తో సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో ప్రజల్లో ఉండేలా చూసుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుకు మాత్రమే టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. మెదక్ టికెట్ను పద్మా దేవేందర్ కే మళ్లీ ఇచ్చారు. ఈ సమాచారం ముందే తెలుసుకున్న మైనంపల్లి.. మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తన కొడుకు కోసమే మైనంపల్లి పట్టుబట్టారు.

మరోవైపు హరీష్ పై వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ మొత్తం మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎలాగో బీఆర్ఎస్లో తండ్రీకొడుకులకు కలిపి టికెట్లు వచ్చే అవకాశం లేదని భావించిన మైనంపల్లి హస్తం గూటికి చేరబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి నుంచి మైనంపల్లి, మెదక్ నుంచి రోహిత్ పోటీ చేయబోతున్నారని తెలిసింది. అయితే కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీర్మానించింది. మరి ఇప్పుడు మైనంపల్లి కుటుుంబంలో ఇద్దరికి టికెట్ ఇస్తారా? అన్నది ప్రశ్న. ఒకవేళ ఇచ్చినా అధికార బీఆర్ఎస్ అభ్యర్థులతో తలపడి గెలుస్తారా? అన్నది మరో ప్రశ్న. మెదక్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ను దాటి రోహిత్ను గెలిపించుకోవడం మైనంపల్లికి కఠిన సవాలు. ఇక్కడ మల్కాజిగిరిలో కేసీఆర్ వ్యూహాలను తట్టుకుని మళ్లీ అధికారం దక్కించుకోవడం కూడా కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.