6 వేల కోట్ల మోసం.. 4 వేల కోట్ల ఆస్తుల అటాచ్‌..!

సుదీర్ఘ విచార‌ణ‌లు, అనేక వంద‌ల‌ మంది సాక్ష్యులు.. వెర‌సి 15 ఏళ్ల‌కుపైగా సాగిన అగ్రిగోల్డ్ కుంభ‌కోణంలో ఎట్ట‌కేల‌కు చార్జిషీట్ దాఖ‌లైంది. ఈ సంస్థ ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మొత్తం 6 వేల కోట్ల‌కుపైగా సొమ్మును డిపాజిట్ల రూపంలో రాబ‌ట్టింది. అనంతరం.. బోర్డు తిప్పేసింది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసుల‌ను గుండుగుత్త‌గా.. ఏపీ హైకోర్టు(అప్ప‌టి ఉమ్మ‌డి) విచార‌ణ‌కు స్వీక‌రించింది.

ఈ క్ర‌మంలోనే మ‌నీలాండ‌రింగ్ కోణంలోనూ ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించి.. కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అప్ప‌గించింది. ఈ సంస్థ సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ప్ర‌ధాన నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ ఎటాచ్ చేసింది. అయితే.. మ‌రో 2000 కోట్ల‌కు పైగా సొమ్ము ఏమైంద‌నేది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే, డిపాజిట‌ర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం రెండు విడ‌త‌ల్లొ కొంత సొమ్మును తిరిగి ఇచ్చిన విష‌యం తెలిసిందే.