బీజేపీ తంత్రం.. జమిలి మంత్రం

వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌కు తాము కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరో తొమ్మిది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకు రావడం బీజేపీ తంత్రం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అన్ని పార్టీలో సహజంగానే గుబులు రేపుతోంది.
 
 ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని అనూహ్యంగా కేంద్రం ప్రకటించింది. అంతలోనే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీని వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేగం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఓ రోడ్‌ మ్యాప్‌ను తీసుకు వస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వచ్చే ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ చేస్తే తాము జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇందుకోసం కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే అసలిది సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదే జరిగితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందుకు, మరికొన్ని వెనుకకు జరగాల్సి ఉంటుంది.
 
అయితే ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరుతో ఏకమవుతున్న వేళ, వారిని ఇరుకున పెట్టేందుకు, దేశ ప్రజల అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు ఇటువంటి జిమ్మిక్కులను బీజేపీ ప్రదర్శిస్తుందనే వాదన వినిస్తున్న వారూ లేకపోలేదు. ఇండియా కూటమికి భయపడే బీజేపీ ఇటువంటి దిగజారుడు పనులు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అనేది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధమని కొందరు రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.

కానీ బీజేపీ మాత్రం వేగంగా పావులు కదుపుతుందనేది స్పష్టం అవుతోంది. కీలక నిర్ణయాలను తీసుకోవడం, ప్రకటించడం, వాటిని అమలు చేయడం, ఎదుటి వారిని గుక్కతిప్పుకోనివ్వకుండా చేయడం బీజేపీ స్ట్రేటజీ. పెద్ద నోట్ల రద్దు నుంచి తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించడం వరకు ఆ పార్టీ ప్రభుత్వం ఇదే తీరును ఫాలో అవుతోంది. ఇప్పుడూ అదే చేస్తోంది. ఇండియా కూటమి ముంబైలో సమావేశం అవుతున్న వేళ బీజేపీ జమిలి ఎన్నికలు తెరపైకి తీసుకురావడంపై విపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.