తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్ సంపాదించిన అతను.. తెలుగులోనూ మార్కెట్ తెచ్చుకున్నాడు. ఒక టైంలో పెద్ద స్టార్లకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో తన సినిమాలు ఆడేవి. ఇరుంబు తిరై (అభిమన్యుడు), తుప్పారివాలన్ (డిటెక్టివ్) లాంటి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ బాగా ఆడాయి.
మధ్యలో కొన్నేళ్లు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డప్పటికీ.. మూడేళ్ల ముందు ‘మార్క్ ఆంటోనీ’ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు విశాల్. ఆ చిత్రం విశాల్కు తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. విశాల్ మళ్లీ లైన్లో పడ్డాడని, ఇక తిరుగులేదని అభిమానులు ఆశించారు. కానీ తర్వాత కథ మళ్లీ మామూలే. విశాల్ అడుగులు తడబడ్డాయి. ఐతే ఇప్పటిదాకా చూసిన పతనమంతా ఒకెత్తయితే.. తన కొత్త చిత్రం ‘మకుటం’తో చూస్తున్న పతనం మరో ఎత్తు. బహుశా కెరీర్లో విశాల్ ఇదే అత్యంత పతనం అని చెప్పొచ్చు.
మూడేళ్ల ముందు వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోకు ఇప్పుడు రూ.3 కోట్ల దగ్గర ఆగిపోవడం షాకింగే. రవి అరసు అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను మొదలుపెట్టిన విశాల్.. అతడి పనితీరు నచ్చకపోవడంతో తనే దర్శకత్వ బాధ్యతలు అందుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఐతే మేకింగ్ ఆలస్యం కావడం, ప్రోమోలు పేలవంగా ఉండడంతో ఈ సినిమాకు రిలీజ్ ముంగిట కనీస బజ్ కూడా లేకపోయింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ మినిమం కూడా లేకపోయాయి. పెద్ద యాక్షన్ హీరోగా పేరున్న విశాల్ సినిమాకు తొలి రోజు కోటి రూపాయల వసూళ్లు కూడా రాని పరిస్థితి.
వీకెండ్ మొత్తానికి కలిపి వచ్చిన కలెక్షన్ రూ.3 కోట్లే. వారాంతం తర్వాత అయితే సినిమాను నడిపించడానికి ఎదురు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మినిమం ఆక్యుపెన్సీలు కూాడా లేక షోలు క్యాన్సిల్ చేసేస్తున్నారు. కొత్తగా యాడ్ అవుతున్న గ్రాస్ ఏమీ లేక ‘మకుటం’ రూ.3 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. విశాల్ సినిమాకు మరీ ఇంత దారుణమైన కలెక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దర్శకుడిగా తన తొలి చిత్రం విశాల్కు ఘోర పరాభవాన్నే మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్యూరే విశాల్కు పెద్ద షాకంటే.. దీని మేకింగ్ వీడియోల మీద ట్రోలింగ్తో తన ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates