అప్పట్లో బాబు అసెంబ్లీకి రాకపోయినా…

ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయించిన ప్రకారం నేటితో ముగుస్తుంది. ఈసారి కూడా శాసన సభా సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ డుమ్మా కొట్టింది. డీఎస్సీ నియమకాలకు సంబందించి అక్రమాలు జరిగాయంటూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్న వైసీపీ అసెంబ్లీకి మాత్రం గైర్హాజరయ్యింది. నిజంగా డీఎస్సీ అక్రమాలపై చిత్తశుద్ధి వుంటే అసెంబ్లీలో దాని మీద చర్చించాల్సిందని అధికార కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు.

జగన్ కు అసెంబ్లీ కి రావాలంటే భయమని, అసెంబ్లీకి వస్తే గ్రూప్- 1 స్కామ్ గురించి జవాబు చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే డీఎస్సీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండదని స్పష్టం చేశారు. శాసనసభలోని తన కార్యాలయం వద్ద సీఎం
చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పాలక పక్షం తప్పులు చేస్తుంటే చట్ట సభలో ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.

వైసీపీ హయాంలో తాను అసెంబ్లీకి వెళ్ళక పోవడం గురించి కూడా చంద్రబాబు ప్రస్థావించారు. అప్పట్లో తాను అసెంబ్లీకి వెళ్లకపోయినప్పటికీ మిగతా సభ్యులు హాజరయ్యారని గుర్తు చేశారు. మొత్తం సభ్యులు హాజరుకాకపోవడం తొలిసారిగా చూస్తున్నానని చెప్పారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే అని చెప్పారు. డీఎస్సీ మీద మేము చర్చకు సిద్దమేనంటూ పలుమార్లు ప్రకటించినప్పటికి వైసీపీ నుంచి స్పందనలేకపోవడం వారి వైఖరికి అద్దం పడుతుందని విమర్శించారు.