సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి అంటూ సుష్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై తాజాగా కొండా సురేఖ స్పందించారు. తన కూతురు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ అన్నారు.
ఆ వ్యాఖ్యలకు రాజకీయంగా తాను బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదని చెప్పారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, క్రమ శిక్షణా కమిటీ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని తెలిపారు. తనకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కూడా సురేఖ కమిటీని కోరారు.
అయితే, ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటినా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సురేఖ వివరణ తర్వాత ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే, కాంగ్రెస్ తరఫున ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు.
కాగా, కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ గుర్రుగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే ఇటీవల రేవంత్ రెడ్డి పర్యటనకు కూడా ఆమె డుమ్మా కొట్టారని టాక్. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై కూతురు సుష్మితతో ఆ వ్యాఖ్యలు చేయించారని పుకార్లు వస్తున్నాయి. మరి, ఈ వ్యవహారానికి టీపీసీసీ ఏరకంగా పుల్ స్టాప్ పెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates