ఒక్కసారిగా హీటు పెంచేసిన మోడీ

దేశరాజకీయాల్లో  నరేంద్రమోడీ ఒక్కసారిగా హీటు పెంచేశారు. ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మంత్రి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమైపోయాయి. ఈమధ్యనే వర్షాకాల సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడే మోడీ ప్రభుత్వంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించింది.

ఇంతలోనే మళ్ళీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అంటే దేనికి అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పార్టీల అధినేతలు, మీడియా కూడా ఎవరికి తోచిన కారణాలను వాళ్ళు అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా బిల్లు, లోక్ సభ రద్దు, ఓబీసీ వర్గీకరణ, హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించటం లాంటి అనేక అంశాలను ఊహించుకుంటున్నారు. ప్రభుత్వం లేదా అధికార పార్టీ నుండి మాత్రం ఎలాంటి లీకులు బయటకు రాలేదు.

ఈ కారణంగానే అన్ని వర్గాల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. జమిలి ఎన్నికల విషయం తీసుకుంటే నిర్వహణ, ఆచరణ సాధ్యం కాదని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. కాబట్టి జమిలి ఎన్నికల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువస్తుందా అనేది సందేహం. ఇక లోక్ సభకు ముందస్తు ఎన్నికల అంశం కూడా కీలకమే. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు పెట్టాల్సిన అవసరంలేదు. ముందస్తు ఎన్నికలకు పార్లమెంటు సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది  క్యాబినెట్  మాత్రమే. మోడీ తలచుకుంటే క్యాబినెట్ నిర్ణయించేసినట్లే.

ఇక మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి బిల్లులకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అవసరమే లేదు. రాబోయే శీతాకాల సమావేశాల్లో కూడా బిల్లులు పెట్టచ్చు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని అనంటున్నారు. ఇదొక్కటే కాస్త అనుమానంగా ఉంది. ఈ అంశం దశాబ్దాలుగా నలుగుతోంది. దీనివల్ల బీజేపీకి ప్రత్యేకంగా జరగబోయే లాభం ఏమిటో అర్ధంకావటం లేదు. మొత్తానికి కారణం ఏమిటో బయటకు చెప్పకుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అనగానే పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిపోతోంది. మరి సస్పెన్స్ ఎప్పుడు బయటపడుతుందో ఏమో.