చంద్రబాబు తీరును తప్పుబట్టిన సీపీఐ నారాయణ

ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కొంతకాలంగా వామపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్లేనని, వైసీపీ గెలుపునకు చంద్రబాబు గేట్లు తెరచినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. వామపక్ష పార్టీలతో కలిసి బరిలోకి దిగితే వైసీపీని ఓడించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అదే తరహాలో టీడీపీ, బీజేపీల పొత్తు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయని, టీడీపీ కళ్లు తెరచి ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు సూచించారు.  పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట ధోరణిని వీడాలని సూచించారు.  వైసీపీ, బీజేపీలు విడిపోవని, ఏపీలో బీజేపీ ఎంత పోరాడినా వైసీపీని ఓడించే పరిస్థితి లేదని అన్నారు.

ఏపీకి అన్ని రకాలుగా నష్టం చేకూర్చిన బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టీడీపీ మద్దతివ్వడం సరికాదన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజన్ ఫెయిల్ అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రయాన్‌తో బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిందని, ఆ ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టి ఓ మతాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

టీటీడీలో మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని, మాంసం అమ్మేవాళ్లను టీడీపీ మెంబర్లుగా చేశారని విమర్శించారు. కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలో మద్దతిచ్చామని,

ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకొని ఉండాల్సిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుమ్ములాటలే ఉంటాయని, తెలంగాణలో కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ కలిస్తే బీఆర్ఎస్‌కు డిపాజిట్లు దక్కవని ధీమా వ్యక్తం చేశారు.