కేసీయార్ అపరిచితుడైపోయారా ?

అప్పుడెప్పుడో వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో ఎలా యాక్ట్ చేశాడో అందరు చూసిందే. ఒకే నిమిషంలో మూడు రకాల షేడ్లలో హీరో నటించి జనాలను ఆశ్చర్యపరిచాడు. ఇపుడు అచ్చంగా కేసీయార్ కూడా అదే పద్ధతిలో వెళుతున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే 119 నియోజకవర్గాలకు గాను 115 స్ధానాల్లో టికెట్లను కేసీయార్ ప్రకటించేసిన విషయం తెలిసిందే. అభ్యర్ధుల ప్రకటన తర్వాత కనీసం 35 నియోజకవర్గాల్లో తీవ్ర గొడవలు జరగుతున్నాయి. సిట్టింగుల్లో ఏడుగురికి టికెట్లివ్వలేదు. మరో నాలుగు పెండింగులో పెట్టారు.

దీనివల్ల ఏమైందంటే టికెట్లు దక్కని ఏడుగురు సిట్టింగ్ ఎంఎల్ఏలు, టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడిన సీనియర్లలో అసంతృప్తి పెరిగిపోతోంది. దాంతో వాళ్ళంతా సడెన్ గా తిరుగుబాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. మరింత ఎక్కువమంది వెళిపోతే బీఆర్ఎస్ కు మొదటికే మోసం వస్తుందనే టెన్షన్ కేసీయార్లో మొదలైంది. అందుకనే ఒకవైపు బుజ్జగింపులు మరోవైపు వార్నింగులు మొదలుపెట్టారు.

పార్టీ మారితే బీఆర్ఎస్ గెలుపు కష్టమని భావించిన అసంతృప్తుల్లో కొందరికి నామినేటెడ్ పోస్టులు కూడా ఎర వేస్తున్నారు. వేములవాడ ఎంఎల్ఏ చెన్నమనేని రమేష్ కు టికెట్ ఇవ్వలేదు. దాంతో చెన్నమనేని మండిపోతున్నారు. అందుకని వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమించారు. పఠాన్ చెరు టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంఎల్సీ భూపాల్ రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్  చైర్మన్ గా ఇచ్చారు. అలాగే ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు మున్సిపాలిటిలో కీలకమైన పదవి దక్కబోతోందని ప్రచారం.

ఇక బీఆర్ఎస్ ను వదిలేసిన ఎంఎల్ఏ రేఖానాయక్ అల్లుడు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను పోలీసు అకాడమీకి సడెన్ గా బదిలీచేసేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీహరిరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.  పోలీసు శాఖలో పెద్ద హోదాలో పనిచేస్తున్న  ఆయన సమీప బంధువును వెంటనే తప్పించారట. కేసీయార్ వ్యవహారం అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లుగా ఉందనే సెటైర్లు పేలుతున్నాయి.