ఎన్నికలు ఎపుడొచ్చినా మోడీ ప్లాన్ సేమ్ 

రక్షాబంధన్ కానుకగా మహిళలకు నరేంద్రమోడీ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందంటు బీజేపీ ఒకటే ఊదరగొడుతోంది. ఇంతకీ ఆ తీపికబురు ఏమిటంటే గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించిందట. అలాగే ఉజ్వల్ పథకంలో గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్న లబ్దిదారులకు ఏకంగా 400 రూపాయలు తగ్గిందని బీజేపీ నేతల సంబరాలు చేసుకుంటున్నారు. గ్యాస్ ధర తగ్గించటమంటే మోడీ కచ్చితంగా మహిళలకు ఇచ్చిన రక్షాబంధన్ కానుకే అంటున్నారు.

కేంద్రప్రభుత్వం తీసుకన్న తాజా నిర్ణయం వల్ల 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉపయోగిస్తున్న మహిళలకు మేలు జరుగుతుందంటున్నారు. అలాగే 75 లక్షల అదనపు ఉజ్వల కనెక్షన్లు మంజూరు చేయాలని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇపుడు తీసుకున్న నిర్ణయాన్ని రక్షాబంధన్ కన్నా ఎన్నికల బంధన్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే రక్షాబంధన్ కానుకంటే మరి పోయి ఏడాది అంతకుముందు ఏడాది కూడా రక్షాబంధన్ పండుగ వచ్చింది కదా అప్పుడెందుకు గ్యాస్ ధర తగ్గించలేదు.

సడెన్ గా ఇపుడు రక్షాబంధన్ పండుగే ఎందుకు గుర్తుకొచ్చింది ? ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే. తెలంగాణా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్, మిజోరం, రాజస్ధాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతోన్నాయి. వీటిల్లో గెలవటం బీజేపీకి చాలా అవసరం. ప్రీ పోల్ సర్వేల్లో మధ్యప్రదేశ్ చత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందని తేలింది. రాజస్ధాన్ లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలుపుకునే అవకాశముందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఇక తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీకి ఎలాగూ లేదు.

అంటే ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కడా లేదని అర్ధమైనట్లుంది. అందుకనే మోడీకి సడన్ గా రక్షాబంధన్ పండుగ గుర్తుకొచ్చింది. 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోడీ ప్రభుత్వం రు. 1200కి తీసుకెళ్ళింది. అందులో నుండి ఇపుడు ఒక 200 రూపాయలు తగ్గించి పండగ చేసుకోమంటోంది. ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గించటం తర్వాత మళ్ళీ పెంచేయటం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. మరి మహిళలు ఏమిచేస్తారో చూడాల్సిందే.